
ఖరీఫ్కు నీరు విడుదల
ధవళేశ్వరం: ఖరీఫ్ సాగుకు సంబంధించి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సునీల్కుమార్, ఈస్ట్రన్ డివిజన్ ఈఈ వివి రామకృష్ణ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. తొలుత తూర్పు డివిజన్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సునీల్కుమార్, ఈస్ట్రన్ డివిజన్ ఈఈ వీవీ రామకృష్ణ గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సునీల్కుమార్ మాట్లాడుతూ రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాలని సూచించారు. ఈఈ రామకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్ త్వరగా ప్రారంభించడం ద్వారా ప్రకృతి విపత్తులు, తుపానులు, వరదల ముంపు బారిన పంటలు పడకుండా రైతు చేతికి అందుతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జూన్ 1న డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో 10,13,161 ఎకరాలకు నీటిని కాటన్ బ్యారేజీ ద్వారా అందిస్తున్నామన్నారు. ఖరీఫ్ని సకాలంలో పూర్తి చేయడం ద్వారా రబీ త్వరగా ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని తద్వారా రబీలో కూడా నీటి ఎద్దడి లేకుండా సాగుకు నీరు అందుతుందన్నారు. 6.1కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. డెల్టా కాలువలకు మొత్తం 500క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీ వద్ద 10.25 అడుగుల వద్ద నీటిమట్టం నెలకొంది. బ్యారేజీ నుంచి ఆదివారం సాయంత్రం 10,707 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ బి వెంకటస్వామి, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ డీసీ సుబ్బారెడ్డి, ఇరిగేషన్ అధికారులు డీఈలు ఆనంద్బాబు, రమేష్, ఏఈలు అద్దంకి సాయిరామ్, డి.రాధాకృష్ణ పాల్గొన్నారు.

ఖరీఫ్కు నీరు విడుదల