
వివిధ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ˘
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పిల్లల రక్షణ విభాగం, ప్రత్యేక దత్తత ఏజెన్సీ, చిల్డ్రన్ హోమ్ 2, వన్ స్టాప్ సెంటర్లలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 19వతేదీ లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ ను జారీచే శామన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19వ తేదీలోపు అందజేయాలని పేర్కొన్నారు.
అన్నదానం భక్తుల
నుంచి అభిప్రాయ సేకరణ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలపై ఎందుకు భక్తుల్లో అసంతృప్తి నెలకొని ఉందనే దానిపై ఇద్దరు ప్రయివేట్ వ్యక్తులతో కూడిన ఐవీఆర్ఎస్ బృందం రెండో రోజు బుధవారం కూడా అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రధానంగా అన్నదానం పథకంలో ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను ఆ బృందం ప్రశ్నించింది. బాగున్నాయని చాలామంది భక్తులు చెప్పినట్టు సమాచారం. అయితే ఒకరిద్దరు మంచినీరు ఆలస్యమవుతోందని తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదానం హాలు ఫ్లోరింగ్ శుభ్రతపై ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫ్లోరింగ్ శుభ్రత ఇంకా బాగుండాలని, చెప్పినట్టు తెలిసింది. దేవస్థానం టాయిలెట్స్లో పరిశుభ్రత పై కూడా ఆ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం.
వక్ఫ్ సవరణలపై నిరసన
కాకినాడ సిటీ: ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా కాకినాడలో బుధవారం ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ చట్టంను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వక్ఫ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వ్యతిరేకిస్తూ ముస్లిం వక్ఫ్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మొయిన్రోడ్డులోని జమియా మసీద్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వక్ఫ్ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ముస్లిం నాయకులు జవహర్ అలీ, తాజువుద్దీన్, అబ్దుల్ బషీరుద్దీన్, రెహమాన్, రహీం, కుతుబుద్దీన్, జిలాని దురాని, అబ్దుల్ రజాక్ రిజ్వీ, గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభిష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసి దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావన్నారు.