దూసుకుపోతున్న పొగాకు మార్కెట్‌ | - | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న పొగాకు మార్కెట్‌

Jun 27 2024 2:34 AM | Updated on Jun 27 2024 2:34 AM

దూసుకుపోతున్న పొగాకు మార్కెట్‌

దూసుకుపోతున్న పొగాకు మార్కెట్‌

రోజురోజుకు పెరుగుతున్న ధర

రైతుల్లో వెల్లువెత్తుతున్న ఆనందం

కిలో గరిష్ట ధర రూ. 363

కనిష్ట ధర రూ. 240

సగటు ధర రూ. 302

దేవరపల్లి: పొగాకు మార్కెట్‌ దూసుకుపోతోంది. వేలం కేంద్రాల్లో కొనుగోలు దారులు దూకుడు పెంచడంతో ఎవరూ ఊహించని విధంగా ధర పలుకుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ధర పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఏర్పడడం, ఎగుమతి ఆర్డర్లు రావడం, అవసరా మేరకు ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి లేకపోవడం, జింబాబ్వే, బ్రెజిల్‌ దేశాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరగడం వంటి కారణాలతో మన పొగాకుకు మంచి డిమాండ్‌ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. గత వారం రోజుల నుంచి మార్కెట్లో పొగాకు ధర పెరుగుతూ వస్తోంది. ఎకరా దిగుబడి తగ్గినప్పటికీ సాగు విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 200 మిలియన్ల కిలోలు, మన జిల్లాలోని రెండు వేలం కేంద్రాలతో పాటు ఏలూరు జిల్లాలోని మూడు వేలం కేంద్రాల పరిధిలో 67 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 6న ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించగా, దాదాపు రెండు నెలలు కొనుగోళ్లు మందకొడిగా జరిగాయి. మొదటి రెండు నెలలు రైతులు లోగ్రేడు పొగాకును చాలావరకు అమ్ముకున్నారు. లోగ్రేడు పొగాకు కిలో రూ.270కు అమ్ముడుపోయింది. మే నెల రెండవ వారం వరకు మార్కెట్‌ మందకొడిగా జరగ్గా, ఎన్నికల అనంతరం ఊపందుకుంది. ప్రస్తుతం పొగాకు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. బుధవారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.363, కనిష్ట ధర రూ.240, సగటు ధర రూ. 302 పలికింది. సోమవారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.337 ఉండగా, మంగళవారం రూ.352 లభించింది. ఈ ధర మరొక వారం రోజుల్లో రూ.400 అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధర గరిష్ట స్థాయికి చేరుకోవడంపై పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం 2024–25 సాగుపై పడుతుందని, ఇప్పటికే భూముల కౌలు, బ్యారన్ల అద్దెలు రెట్టింపు పలుకుతున్నాయని అంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభించి 110 రోజులు కాగా, 85 రోజులు వేలం జరిగింది. ఇప్పటి వరకు ఐదు వేలం కేంద్రాల్లో 30.20 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. మార్కెట్లో ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం జరిగిన విక్రయాలు ఇలా ఉన్నాయి.

వేలం కేంద్రం విక్రయాలు గరిష్ట కనిష్ట సగటు

( కిలోలు) (రూ.) (రూ.) (రూ.)

దేవరపల్లి 71,567 363 211 300.30

జంగారెడ్డిగూడెం–1 96,278 361 240 300.33

జంగారెడ్డిగూడెం–2 1,07,899 363 235 302.92

కొయ్యలగూడెం 1,07,990 363 240 301.49

గోపాలపురం 60,172 360 235 305.87

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement