
కంద రైతు కుదేలు
● గతేడాది పుట్టు కందఽ ధర రూ.11 వేలు, నేడు రూ.7 వేలు
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
గిట్టుబాటు– నేడు నష్టాల పాట్లు
● ఎకారానికి రూ.35వేల నుంచి రూ.1.75 లక్షల నష్టం
● జిల్లాలో కంద సాగు విస్తీర్ణం 1,450 హెక్టార్లు
పెరవలి: జిల్లాలో కంద సాగుచేస్తున్న రైతులు కొన్నేళ్లుగా లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభించకపోవడంతోపాటు, దిగుబడి తగ్గడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు కంద ధర రూ.7వేలు పలకడంతో ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కంద ధరలు చరిత్ర సృష్టిస్తే.. నేడు ధరలు పతనం అవ్వడంతో రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగున్నా మార్కెట్లో ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టులు (పుట్టు– 232 కిలోలు) దిగుబడి వస్తోంది. సరైన ధర లేక రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు నష్టం రావటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు.
జిల్లాలో కందసాగు విస్తీర్ణం ఇలా ..
జిల్లాలో కంద పంట గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేపట్టారు. గతేడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు మండలాల్లో గతేడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటం వల్ల ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచటంతో నేడు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు.
రైతుల ఆందోళన
కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.7, వేలు వద్ద స్థిరంగా ఉంది. తవ్వకాలు చేపట్టిన మొదటిలోనే ఇలా ఉంటే, పంటంతా చేతికి అందే సమయంలో ధరలు మరింత పతనమవుతాయోనని తవ్వకాలు చేపట్టని రైతులు ఆందోళన చెందుతున్నారు.
లాభాల నుంచి నష్టాలకు..
కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.11 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.7వేలు ఉండటం, దీనికితోడు దిగుబడి తగ్గటంతో రైతులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్టులకు రూ.3.50 లక్షలు, 60 పుట్టులకు రూ.4.20 లక్షలు, 70 పుట్టులకురూ.4.90 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.5.60 లక్షలు ఒక ఎకరానికి అయ్యేది. దీంతో దిగుబడిని బట్టి ఒక ఎకరానికి రూ.35 వేలు నుంచి రూ.1.75 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది.
నష్టాలు ఇలా..
పెట్టుబడి ఎకరానికి రూ.5.25 లక్షలు అవుతుంటే ఎకరానికి 50 పుట్టులు, దిగుబడి బాగుంటే మార్కెట్ ధర ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.7 వేలు చొప్పున 50 పుట్టులకు రూ.3.50 లక్షలు వస్తుందని, అదే 60 పుట్టుల దిగుబడి ఉంటే రూ. 4.20 లక్షలు, 70 పుట్టుల దిగుబడి ఉంటే రూ.4.90 లక్షలు రైతులకు వస్తుంది. దీని ప్రకారం ఒక ఎకరానికి 70 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులకు రూ.35 వేలు, 60 పుట్టులు, వచ్చిన వారికి రూ.1.05 లక్షలు, 50 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులు రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు.
ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నేడు నష్టాల పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తుందనుకుంటే నేడు ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం.
–వేండ్ర ఏసు, కంద రైతు, ముక్కామల
ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలి
గత ఐదేళ్లూ కంద రైతులు లాభాలు అందుకోగా నేడు తీవ్రంగా నష్టపోయాం. గతంలో పెట్టుబడి సొమ్ము వచ్చేది. నేడు రాని పరిస్థితి. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియటం లేదు.
–బొలిశెట్టి వెంకటేశ్వరరావు, కంద రైతు,
అన్నవరప్పాడు
మార్కెట్లో వినియోగం తగ్గింది
ఉభయ గోదావరి జిల్లాల్లో పండించిన కంద పంటకు చైన్నె, ముంబయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్లో వినియోగం తగ్గటంతో ధరలు తగ్గాయి. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద దిగుబడి బాగుండటం ధరలు తగ్గటానికి కారణమైంది.
–గడుగోయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి
దిగుబడి ఉన్నా..
గతేడాదిలాగే ఈ ఏడాది దిగుబడి ఉన్నా గతంలో ఉన్న ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. గతేడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తే ఈ ఏడాది 50 నుంచి 70 పుట్టులు వచ్చింది.
పెట్టుబడి..
కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా ల్సి ఉంది. ఎకరం కంద వేయాలంటే 30 పుట్టుల విత్త నం వేయాలి. గతేడాది విత్తనం ధర పుట్టు రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్ష లు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ. లక్ష ఖర్చు అయింది. పెంట వేయటానికి రూ.30 వే లు, ఎరువులు, పురుగు మందులకి రూ.40వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25వేలు .. మొత్తం ఖర్చు రూ.5.25 లక్షలు అవుతుండగా.. నేడు మార్కె ట్ ధరల ప్రకారం ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు.

కంద రైతు కుదేలు

కంద రైతు కుదేలు

కంద రైతు కుదేలు

కంద రైతు కుదేలు