
బండారులంకలో రేషన్ బియ్యం పట్టివేత
డ్రైవర్, ఇద్దరు డీలర్లపై కేసు నమోదు
అమలాపురం రూరల్: బండారులంక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 55 బస్తాల బియ్యం లోడుతో వెళుతున్న వ్యాన్ను పోలీసులు పట్టుకున్నారు. సరకును స్వాధీనం చేసుకుని, వ్యాన్ సీజ్ చేసి, డ్రైవర్తో పాటు, ఇద్దరు రేషన్ డీలర్లపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు, రూరల్ మండలం బండారులంక గ్రామంలో రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని వ్యాన్లో లోడ్ చేసి తరలిస్తుండగా, సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వాహనాన్ని అడ్డగించి, పోలీసులకు, సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. ఈ వ్యాన్లో 50 కేజీల వంతున 55 బస్తాల్లో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. వాహనాన్ని తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఎ.సత్యనారాయణ, రేషన్ డీలర్లు సుగ్గు మాణిక్యాలరావు, కాశిన సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శేఖర్బాబు తెలిపారు.