
గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి రాహుల్మీనా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ దరఖాస్తులు పరిశీలించి ఐదు సంవత్సరాలు నిండిన ఉద్యోగులను, వివిధ కారణాలతో రిక్వెస్ట్ బదిలీలు కోరిన 15 మంది ఉద్యోగులను వారు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం వివాదాలకు తావివ్వకుండా బదిలీ చేశామన్నారు. ఆయన బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్చార్జి కార్యదర్శి పాలంకి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.జయకృష్ణ పాల్గొన్నారు.