
సర్కారు వారి ఆయిల్బామ్!
కాకినాడ జిల్లాలో సాగు వివరాలు
వరి సాగు చేసే భూములు
– 1.58 లక్షల ఎకరాలు
సాగు చేసే రైతులు – 1.45 లక్షల మంది
ఏటా ధాన్యం దిగుబడి
– 5.70 లక్షల టన్నులు (ఒక పంటకు)
పట్టు సాగు చేస్తున్న మండలాలు – 19
పట్టు సాగు చేస్తున్న గ్రామాలు – 155
పట్టు సాగు చేస్తున్న రైతులు – 1,150 మంది
పట్టు సాగు చేస్తున్న భూమి –4,500 ఎకరాలు
పట్టుగూళ్ల దిగుబడి –రోజుకు 5 టన్నులు
వాణిజ్య పంటలు సాగు చేస్తున్న భూములు
– 36,738 హెక్టార్లు
వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు
– సుమారు 40 వేల మంది
పామాయిల్ సాగవుతున్న భూములు
– 12,679 హెక్టార్లు
పామాయిల్ సాగు చేస్తున్న రైతులు
– సుమారు 10 వేల మంది
పిఠాపురం: పంట చేతికందితే రైతుకు ఏటా ఆదాయం వస్తుంది. అది ఒక్క వార్షిక పంటలకే సాధ్యమవుతుంది. అదే బహు వార్షిక పంటలైతే పంట నాటిన కొన్నేళ్ల వరకు రైతుకు ఆదాయం రాదు. వార్షిక పంటలైతే ఏటా లాభాలతో పాటు నష్టాలు ఉంటాయి. అలా నష్టాలు వస్తే పరిహారం కోసం రైతు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాడు. రాయితీలు, నష్ట పరిహారాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా ఒకటేమిటి అన్నీ ప్రభుత్వం రైతుకు కల్పించాల్సి ఉంటుంది. వీటికితోడు సాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలి. వరదలు వచ్చినా, వానలు వచ్చినా తెగుళ్లు విజృంభించినా రైతుకు నష్ట పరిహారం ఇవ్వక తప్పదు. ఇలాంటి బాధలు తప్పించుకోవడానికి, భారం తగ్గించుకోవడానికి కూటమి ప్రభుత్వం బహు వార్షిక పంటల సాగును తెరపైకి తెచ్చింది. దీని కోసం ప్రతి జిల్లాకు టార్గెట్లు నిర్ణయించింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాకు 10 వేల ఎకరాల ఆయిల్పామ్ వంటి పంటలు సాగు చేయించాలని టార్గెట్ పెట్టారు. దీంతో అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవల పట్టు రైతులు తమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడగడానికి వెళితే జిల్లా ఉన్నతాధికారులు నష్టం వచ్చే పంటలకు బదులు ఆయిల్ పామ్ వంటివి సాగు చేసుకోండి అని ఇచ్చిన సలహా ఇప్పుడు వరి, ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇస్తున్నారు. అగ్రికల్చర్, సెరీ కల్చర్, హార్టి కల్చర్కు జిల్లా అధికారులు లక్ష్యాలు నిర్ణయించడంతో ఆయా శాఖల అధికారులు ప్రస్తుతం రైతులను ఒప్పించే పనిలో బిజీగా మారారు. ముందుగా ఖాళీ భూములను గుర్తించి వాటిలో ఆయిల్పామ్ సాగు చేయాలని చెబుతున్నారు. ఇతర పంటలను సైతం నిలిపివేసి ఆయిల్పామ్ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని రైతులకు నచ్చజెబుతున్నారు. బహు వార్షిక పంటలను సాగు చేయమని చెబుతున్నామని అధికారులు అంటున్నప్పటికీ ఎక్కువ శాతం ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తున్నారు.
ఆయిల్పామ్ లాభదాయకమేనా?
సాధారణంగా ఆయిల్పామ్ సాగు ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో నీటి వసతి తక్కువగా ఉన్న ఏరియాల్లో చేస్తుంటారు. నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ వీటి సాగుకు రైతులు ముందుకు రారు. ఆయిల్పామ్ ఒక్కో ఏడాది మంచి లాభాలు ఇచ్చినా కొన్నేళ్ల పాటు తీవ్ర నష్టాలనే చూపించిందంటున్నారు రైతులు. గత ఐదేళ్లుగా టన్ను రూ.10 వేలు మాత్రమే ఉండడంతో పెట్టుబడి కూడా రాలేదని రైతు ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. గతంలో థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి కావడం, అది తక్కువ రేటు ఉండడంతో ఇక్కడ ఆయిల్పామ్కు డిమాండ్ లేకపోయింది. దీంతో రేటు అమాంతం పడిపోయి జిల్లాలో ఉన్న ఒక పామాయిల్ కంపెనీ సైతం మూతపడినట్లు రైతులు చెబుతున్నారు. అలాంటిది ఈ ఏడాది థాయిలాండ్ నుంచి దిగుమతులు లేక ఇక్కడి వాటికి డిమాండ్ పెరిగి టన్ను రూ.21 వేలకు చేరడంతో ప్రస్తుతం లాభాలు వస్తున్నాయంటున్నారు. ఇలా ఒక్కో ఏడాది ఒక్కో మాదిరిగా డిమాండ్ ఉండే ఆయిల్పామ్ను లాభదాయక పంటగా అధికారులు చెబుతుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్పామ్ సాగు చేస్తే కనీసం నాలుగేళ్ల పాటు ఎటువంటి ఆదాయం ఉండదు. అంతర పంటలు సాగు చేసుకుంటే తప్ప ఆదాయం రాదదని రైతులు చెబుతున్నారు. అంతర పంటలు కూడా అంతగా ఆదాయాన్ని ఇవ్వవని, ఏ పంటా వీలు లేని పొలాల్లో మాత్రమే ఆయిల్పామ్కు ప్రాధాన్యం ఇస్తారని రైతులు చెబుతున్నారు. రైతు ఎలా ఉన్నా తమపై భారం పడకుండా, ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా ఉండాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం బహువార్షిక పంటల పేరుతో వరితో సహా ఇతర పంటల సాగును నిలిపివేయించి ఆయిల్పామ్ సాగును పెంచే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేకంగా ఆయిల్పామ్
సాగుకు జిల్లాలకు టార్గెట్లు
వరి, పట్టు వంటి పంటలకు
ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం
రాయితీలు, నష్ట పరిహారాల భారం
తగ్గించుకోవాలని సర్కారు ఎత్తుగడ
రైతులను ఒప్పించే పనిలో
నిమగ్నమైన అధికార యంత్రాంగం
నష్టాలు రాకుండా చూడాలనే..
విచ్చల విడిగా రసాయనాలు వాడడం వల్ల పంటలు దెబ్బతిని రైతు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వారికి మేలు చేయడానికే ప్రభుత్వం బహు వార్షిక పంటలను వేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఆయిల్పామ్ వంటి పంటలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. పంటల మార్పిడి జరిగితే రైతుకే మంచిది. అందువల్లే బహవార్షిక పంటల సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– చైత్రవర్షిణి, పాడా పీడీ, పిఠాపురం