రోడ్డు ప్రమాదంలో వ్యక్తి... | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి...

May 30 2025 3:10 PM | Updated on May 30 2025 3:10 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి...

గండేపల్లి: హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒడిశాకు చెందిన చంద్రశేఖర్‌ ప్రధాన్‌ (27), త్రిలోచన్‌ ప్రధాన్‌ పనుల కోసం కారులో ముంబయి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు మండలంలోని నీలాద్రిరావుపేట పరిధి చక్రవర్తినగర్‌ వద్ద రోడ్డుపై నిలిపిన కంటైనర్‌ లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ పక్క సీట్లో ఉన్న చంద్రశేఖర్‌ ప్రధాన్‌ తీవ్రంగా గాయపడటంతో అతనిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు.

విద్యుత్‌ షాక్‌తో...

పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏ విజయనగరంలో హెచ్‌డీ కరెంట్‌ పనులు చేస్తున్న కూలి గురువారం కరెంట్‌ షాక్‌తో మృతి చెందినట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం అడ్డతీగల మండలం జీ కొత్తూరుకు చెందిన బూడిద మహేష్‌బాబు విద్యుత్‌ పనులు చేస్తుంటాడు. గురువారం గొల్లప్రోలు మండలం ఏ విజయనగరంలో హెచ్‌డీ కరెంట్‌ పనులు చేస్తూ విద్యుత్‌ స్తంభాన్ని పైకి లేపగా పైన ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర గాయాలైన అతనిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువు బూడిద మరియ ఇచ్చిన ఫిర్యాదుపై గొల్లప్రోలు ఎస్సై ఎన్‌.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని వివాహిత..

పిఠాపురం: గొల్లప్రోలు మండలం కొడవలి పాత హరిజనపేటకు చెందిన నామా నాగమణి బుధవారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందినట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం తన భర్తకు గల అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. గురువారం రాత్రి కొడవలిలో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. ఈమెకు భర్త, కుమార్తె మౌనిక, కుమారుడు నిఖిల్‌ ఉన్నారు. మృతురాలి అక్క పుప్పాల సూర్యమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు ఎస్సై ఎన్‌.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement