
లారీ డ్రైవర్ హల్చల్
జగ్గంపేట: జగ్గంపేట పోలీసు స్టేషన్ వద్ద మద్యం తాగిన ఒక డ్రైవర్ గాజుముక్కతో శరీరాన్ని కోసుకుంటూ రక్తం ఓడుతుండగా పోలీసులను తిడుతూ గురువారం రాత్రి నానా హంగామా సృష్టించాడు. అతని వద్దకు వెళ్లడానికి స్థానికులు భయపడ్డారు. కొద్దిసేపటి తరువాత పోలీసులు అతన్ని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. గుర్రంపాలెం రోడ్డులో వున్న ఒక రైసు మిల్లు వద్ద రోడ్డుపై ఒక వ్యక్తి దుస్తులు విప్పేసి వచ్చి వెళ్లే వాహనాలను ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని 100కి స్థానికులు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాథరావు అక్కడకు కానిస్టేబుల్స్ను పంపారు.మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు వారించినా అతను వినకపోవడంతో పోలీసులు అతని వద్ద వున్న సెల్ఫోన్ తీసుకున్నారు. మద్యం మత్తులో వున్న వ్యక్తి లారీ డ్రైవర్ అని, ఎక్కడి నుంచో స్థానిక రైసు మిల్లుకు లోడ్ తీసుకువచ్చినట్లు స్థానికులు చెప్పారు. సెల్ఫోన్ తీసుకోవడంతో మద్యం సేవించిన డ్రైవర్ పోలీసులను తిడుతూ, చచ్చిపోతానని బెదిరిస్తూ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. నా సెల్ఫోన్తో పాటు నా దగ్గర నగదు కూడా తీసుకున్నారని ఆరోపణలు చేశాడు. మీరు పోలీసులా రౌడీలా అంటూ కేకలు వేశాడు. అక్కడ దొరికిన బీరు బాటిల్ బద్దలు కొట్టి గాజుముక్కతో శరీరంపై గాట్లు పెట్టుకున్నాడు. దీంతో శరీరం రక్తంతో తడిసిపోయింది. గాజుముక్కతో బెదిరించడంతో ఎవరూ దగ్గరకు వెళ్లడానికి సాహసం చేయలేదు. కొద్దిసేపటి తరువాత పోలీసుల అతనిని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు.
మద్యం మత్తులో
పోలీసులపై తిట్ల పురాణం
సెల్ఫోను, నగదు తీసుకున్నారని
ఆరోపణ