
ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన
నిడదవోలు : పట్టణంలో ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేట వెళ్లడానికి అనువైన ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం శుక్రవారం వివిధ ప్రాంతాల్లో రైల్వే, మున్సిపల్ అధికారులు పర్యటించారు. ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేట వెళ్లడానికి ప్రజలు రైల్వేట్రాక్ దాటవలసి వస్తోంది. అయితే ఇందిరానగర్ వద్ద ఉన్న రైల్వేగోడకు ఉన్న మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో అక్కడి స్థానికులు గోడను మూయడానికి వీలు లేదని గతంలో అడ్డుకున్నారు. దీంతో అధికారులు గోడ మార్గాన్ని మూసివేసే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రావడంతో విజయవాడ రైల్వే డివిజినల్ ఆపరేటింగ్ మేనేజర్ సోమశేఖర్నాయుడు తన సిబ్బందితో కలిసి ఫుట్పాత్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలో చినకాశిరేవు వద్ద కూడా మరో ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, నిడదవోలు రైల్వే ఐవోబీ అధికారి కిషోర్, టౌన్ఫ్లానింగ్ అధికారి సుప్రియ పాల్గొన్నారు.