
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
గోపాలపురం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలపురం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన తుంగా వంశీ (25) బుధవారం రాత్రి గోపాలపురం గ్రామ శివారు పొగాకు బోర్డు సమీపంలో ఉన్న వేప చెట్టుకు వేలాడుతూ మృతిచెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న వంశీ మేనమామ కూనపోం వెంకట్రావు వెళ్లి చూసి గురువారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ తల్లి 10 సంవత్సరాల వయసులో మృతిచెందింది. తండ్రి వేరే పెళ్లి చేసుకుని వెళ్లపోవడంతో వంశీ, అతని అక్క వందన మేనమామ ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగించారు. అయిదు సంవత్సరాల క్రితం అక్క వందన మలకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్లిపోయింది. దీంతో అతను తన మేనమామ వద్ద ఉంటూ కూలి పనులు చేస్తుండేవాడు. వంశీ చెడు వ్యసనాలకు బానిస కావడంతో మేనమామ పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఒంటరి జీవితాన్ని గడప లేక మనస్తాపానికి గురైన వంశీ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. మేనమామ వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై యెగ్గేపల్లి సత్యనారాయణ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.