
కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే కడతేరిపోయాడు
ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని పోషిస్తాడు అనుకుంటే చదువు పూర్తికాకుండానే తన కుమారుడు కడతేరిపోయాడని ఒక తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో గల్లంతై మృతిచెందిన తాతపూడి నితీష్ తండ్రి రాజును వారించడం అక్కడివారి వల్ల కాలేదు. తన కుమారుడు బీఎస్సీ యానిమేషన్ కోర్సు చదువుతూ తనకు ఆసరాగా ఉంటున్నాడని ఇటీవల ఆర్థిక పరిస్థితి బాగా లేక తాను ఫీజు కట్టలేనని చెప్పగా డాడీ నా ఫీజు నేనే కట్టుకుంటానని చెప్పి ఈవెంట్స్ చేసి తన ఫీజులు తానే కట్టుకుంటున్నాడని వాపోయారు. కుటుంబాన్ని ఆదుకుంటాడని, తన కుమార్తెలిద్దరికీ పెద్ద దిక్కుగా ఉంటాడని అనుకున్నానని, అంతలోనే అర్ధంతరంగా మృతి చెందాడని రోదిస్తూ చెప్పారు. ఇక్కడి ఫంక్షన్కు రాకుండా ఉంటే నా కొడుకు బతికి ఉండేవాడని విలపించారు.