
ఆరుగురు
విద్యార్థులు గురువులు
నగరి : ఉపాధ్యాయుల బదిలీల్లో తమిళ మాధ్యమ ఉపాధ్యాయులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ఉపాధ్యాయులు ఉండాలన్న అంశాన్ని పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం శ్రీ రంగంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు తమిళ మాధ్యమ విద్యార్థులు ఉండగా వారికి ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించడం ఆరోపణల్లో వాస్తవికతను చాటి చెబుతోంది. తమిళనాడు సరిహద్దును ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లాలో తమిళ మాధ్యమం కలిగిన 16 ఉన్నత పాఠశాలలు, 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సుమారు 200 మంది తమిళం బోధించే ఉపాధ్యాయులున్నారు. వీరికి ఇటీవల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. వెబ్ కౌన్సెలింగ్ మేరకు బలవంతపు బదిలీలు నిర్వహించిన అధికారులు ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీ చేస్తున్నామా? లేదా? అనే అంశాన్ని విస్మరించారు. దీంతో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. నగరి మున్సిపాలిటీలో 252 మంది తమిళ మాధ్యమ విద్యార్థులున్న ఏకాంబరకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6 గురు ఉపాధ్యాయులను, 230 మంది తమిళ మాధ్యమం విద్యార్థులున్న సత్రవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6 గురు ఉపాధ్యాయులనే కేటాయించారు. గుడిపాల మండలం శ్రీరంగంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 గురు విద్యార్థులకే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించారు. అలాగే బొమ్మసముద్రం పాఠశాలలో 8 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లను కేటాయించారు. దీంతో తమిళ ఉపాధ్యాయులు ఇదేమి వెబ్ కౌన్సెలింగ్ అంటూ విస్తుపోతున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ బదిలీలేంటని అవాక్కవుతున్నారు. అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతున్నారు.
తమిళ మాధ్యమ టీచర్లపై వివక్ష
వెబ్ కౌన్సెలింగ్ పేరిట బలవంతపు బదిలీలు
252 మంది ఉన్న పాఠశాలకు ఆరుగురే టీచర్లు