
రైతులకు సేవ చేద్దాం
చిత్తూరు రూరల్(కాణిపాకం) : జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటుధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, క్లబ్ సేవల్లో ఇకపై రైతులకు సేవ చేసేలా చూద్దామని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ చంద్ర హెచ్ రెడ్డి, మాజీ గవర్నర్ భానుమూర్తి రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా శ్రీధర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా శ్రీనివాసమూర్తి, కోశాధికారిగా ప్రసాద్రెడ్డి ఎన్నియ్యారు. గవర్నర్లు మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా శ్రీధరర్రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికయ్యారన్నారు. లయన్స్గోల్డ్ సేవలను విస్తృతం చేస్తూ..ముందుకు వెళ్లాలన్నారు. ప్రధానంగా జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బెంగుళూరులో కేజీ మామిడి కాయ రూ.200 వరకు పలుకుతుంటే..ఇక్కడ రూ.4 రూ.5 అంటున్నారు. ఇలాంటి తరుణంలో క్లబ్ తరపున రైతులకు మేలు చేసేలా చూద్దామన్నారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు టీకాలు అందుబాటులోకి వచ్చాయని , 25 మంది ఆడపిల్లలకు తొలి వ్యాక్సిన్ ఖర్చులను తాను భరిస్తానని మాజీ గవర్నర్ వెల్లడించారు. అనంతరం కుట్టుమిషన్లు, గొడుగులు పంపిణీ చేశారు. మాజీ గవర్నర్ విజయభాస్కర్రెడ్డి, రీజన్ చైర్పర్సన్ లయన్ ఏవీ భాస్కర్, జోన్ చైర్పర్సన్ రవి, సభ్యులు సుభాష్ జైన్, మనోహర్, జమీర్ అహ్మద్, నరేష్, మోహన్రెడ్డి, విజయకుమార్రెడ్డి, పూల సుబ్రమణ్యం, చంద్రశేఖర్రెడ్డి, రమణ, మల్లి, ఎర్రయ్య పాల్గొన్నారు.