
చివరి కాయ వరకు మామిడిని కొంటాం
గంగాధరనెల్లూరు : మామిడి రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని గంగాధర నెల్లూరులోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బుధవారం రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. తోతాపురి మామిడి చిట్టచివరి దాకా ఆగస్టు నెల చివరి కాయ వరకు ఎంత పంట వస్తుందో అంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మామిడి కాయల కొనుగోలు ధరలపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
మార్కెట్లో డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల సమస్యలు ఉన్నాయన్నారు. టోకెన్ పద్ధతి విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక పది రోజులు ఇలా ఉండొచ్చు తర్వాత అన్ని సమస్యలను తగ్గిపోతాయని కలెక్టర్ చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాసులు , సీఐ శ్రీనివాసంతి, జైన్ ఫ్యాక్టరీ మేనేజర్ దిలీప్ పాల్గొన్నారు.