
పరిశీలనలో ఇలా..
కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణుల, బాలింతలకు పంపిణీ చేసిన నాసిరకం, పురుగు పట్టిన కందిపప్పు సరఫరాపై ఈనెల 25న సాక్షి జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ నాసిరకం కందిపప్పు సరఫరా అయినట్లు తేలింది.
● గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని 389 అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం కందిపప్పు సరఫరా చేశారు. ఆ నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం ఆముదాల, సింహరాజపురం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించగా పుచ్చిపోయిన పురుగు పట్టిన కందిపప్పు దర్శనమిచ్చింది. మరికొన్ని చోట్ల తుది గడువు ముగిసిన కందిపప్పు ప్యాకెట్లను పంపిణీ చేశారు.
● పుంగనూరు నియోజకవర్గంలో 380 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం అంగన్వాడీ కేంద్రం–3 ను పరిశీలించగా కందిపప్పు నాసిరకంగా ఉంది. అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 15,431 మంది చిన్నారులకు, 4259 మంది గర్భిణులు, బాలింతలకు మొత్తం పురుగు పట్టిన, నాసిరకం కందిపప్పును సరఫరా చేసేశారు.
● పలమనేరు నియోజకవర్గంలో 408 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సాక్షి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించింది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీలకుంట అంగన్వాడీని పరిశీలించగా పురుగు పట్టిన కందిపప్పు కనిపించింది.