
పశువులపై ఒంటరి ఏనుగు బీభత్సం
● అక్కడికక్కడే ఒక ఆవు మృతి ● చావు బతుకుల మధ్య మరొక్కటి
పెద్దపంజాణి : పాడి పశువులపై ఒంటరి ఏనుగు దాడిలో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆవు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండలంలోని పెద్దకాప్పల్లి పంచాయతీ అటవీ సరిహద్దు గ్రామమైన పెనుగొలకల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు.. పెనుగొలకల గ్రామానికి చెందిన రామయ్య కుమారుడు క్రిష్ణప్ప వ్యవసాయంతో పాటు పాడి పశువులు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పశువులను పగలంతా పొలాల వద్ద మేతకు వదిలి సాయంత్రం అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డు కింద కట్టేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం వేకువ జామున పలమనేరు రేంజ్ కీలపట్ల బీట్ నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు పశువులపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆవు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతోంది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఉదయం పొలం వద్దకు వెళ్లిన బాధిత రైతు జరిగిన సంఘటనను చూసి ఆందోళనకు గురయ్యాడు. ఏనుగుల దాడిలో దాదాపు రూ 80 వేలు నష్టం వాటిల్లిందని వాపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పుంగనూరు ఎఫ్ఆర్వో శ్రీరాములు.. ఆవుకు పంచనామా నిర్వహించి, తీవ్రగాయాలతో ఉన్న మరో ఆవుకు చికిత్స చేయించారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపి నష్టపరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్వో తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు సుకుమార్, బాలసుబ్రమణ్యం, ఎఫ్బీఓ రవికుమార్ పాల్గొన్నారు.