
కృతజ్ఞతాభావమే సనాతన ధర్మం
పుత్తూరు: కృతజ్ఞతాభావమే సనాతన ధర్మం అని ఉడిపి పీఠాధిపతి శ్రీఈషాప్రియ తీర్థ స్వామీజీ పేర్కొన్నారు. ఉడిపి మఠం నుంచి పాదయాత్రగా వస్తున్న స్వామీజీ మంగళవారం సాయంత్రం పుత్తూరు చేరుకున్నారు. స్థానిక ఈశ్వరాలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణమందిరంలో స్వామీజీ ఉపన్యసిస్తూ శివ నామస్మరణతో అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందని తద్వారా వైరాగ్యం ఏర్పడి జ్ఞానం వైపు నడుస్తామని వెల్లడించారు. ప్రకృతితో మమేకమై జీవించాలని సూచించారు. మనం తీసుకుంటున్న గాలి, నీరు, భోజనం ఎవరి ద్వారా వచ్చిందో వారిపై కృతజ్ఞతాభావంతో ఉండాలని అప్పుడే సనాతన ధర్మాన్ని కాపాడగలమని ఉద్భోదించారు. మనం భూమీదకు వచ్చిన తాత్కాలిక సందర్శకులం మాత్రమేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. భారతదేశం గురించి తెలుసుకోవాలని, శరీరమనే క్షేత్రాన్ని ఎలా శుద్ధిగా ఉంచుకొవాలనే విషయాన్ని తెలియజేయాలని, సనాతన ధర్మం వైపు ఎలా నడవాలని పూర్వీకులు చెప్పిన విషయాలను తిరిగి తెలియజెప్పాలని, శాస్త్రాలు చదవడంతో పాటు దేశాన్ని పర్యటించడంతో జ్ఞానం కలుగుతుందనే ఉద్దేశంతో పాదయాత్రను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హిందూ సేవా సమితి సభ్యులు బాలకృష్ణారెడ్డి, మురళీకృష్ణ, నాగభూషణం, కోటకొండ బాబు, సుబ్రమణ్యం, రామకృష్ణ, రమేష్ పురోహితులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.