ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ మధ్య న్యాయ పోరాటం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. కోర్టు విచారణ ప్రారంభానికి కొద్ది గంటల ముందు మస్క్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మన్కు పంపిన సందేశాలు ప్రస్తుతం ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏమిటా సందేశం?
సీఎన్బీసీ నివేదికల ప్రకారం, విచారణకు కేవలం రెండు రోజుల ముందు ఎలాన్ మస్క్, గ్రెగ్ బ్రోక్మన్కు సంప్రదింపులు జరిపారు. ఇరుపక్షాలు తమ వాదనలను విరమించుకుని కేసును పరిష్కరించుకుందామని బ్రోక్మన్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనకు మస్క్ ఇచ్చిన స్పందన అత్యంత తీవ్రంగా ఉంది. ‘ఈ వారం చివరి నాటికి మీరు, సామ్ ఆల్ట్మాన్ అమెరికాలోనే అత్యంత అసహ్యించుకునే వ్యక్తులుగా మారుతారు. మీరు పట్టుబట్టి ముందుకు వెళితే అలాగే ఉంటుంది’ అని మస్క్ హెచ్చరించినట్లు న్యాయస్థానంలో దాఖలు చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.
ఓపెన్ఏఐ వాదన
ఈ సందేశాన్ని ఓపెన్ఏఐ న్యాయ బృందం చాలా సీరియస్గా పరిగణించింది. మస్క్ తన పోటీదారులను, ఆ సంస్థల్లోని కీలక వ్యక్తులను వ్యక్తిగతంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఓపెన్ఏఐ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మస్క్ ఈ దావాను కేవలం ఒక పోటీ వ్యూహంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
వివాదం నేపథ్యం
2024లో మొదలైన ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 2015లో ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఎలాన్ మస్క్, ఆ సంస్థకు దాదాపు 38 మిలియన్ డాలర్ల విరాళం అందించారు. ఆ సంస్థ లాభాపేక్ష లేని (నాన్ ప్రాఫిట్), అందరికీ అందుబాటులో ఉండేలా పనిచేయాలని మస్క్ అప్పట్లో ఆకాంక్షించారు. అయితే, సంస్థ ప్రస్తుతం లాభాపేక్ష దిశగా మళ్లడంపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత వారం కోర్టులో సాక్ష్యం చెబుతూ సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లు ఒక స్వచ్ఛంద సంస్థను తీరునే మారుస్తున్నారని ఆరోపణలు చేశారు.
తదుపరి పరిణామాలు
మస్క్ ఆరోపణలను ఓపెన్ఏఐ వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐకి మరింత వ్యాపారం లభించేందుకు, మార్కెట్ పోటీని దెబ్బతీయడానికి ఆడుతున్న నాటకమని సంస్థ వాదిస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ?


