మహాదేవ్‌ యాప్‌.. రూ.1,700 కోట్ల ఆస్తులు జప్తు! | ED Seizes Rs 1700 Cr Assets in Mahadev Online Book Betting Syndicate Under PMLA | Sakshi
Sakshi News home page

మహాదేవ్‌ యాప్‌.. రూ.1,700 కోట్ల ఆస్తులు జప్తు!

Mar 27 2026 7:37 AM | Updated on Mar 27 2026 12:13 PM

ED Seizes Rs 1700 Cr Assets in Mahadev Online Book Betting Syndicate Under PMLA

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్‌ ఆన్‌లైన్ బుక్’ బెట్టింగ్ సిండికేట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో అడుగు వేసింది. ఈ అక్రమ బెట్టింగ్ సామ్రాజ్య సూత్రధారులైన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌కు చెందిన సుమారు రూ.1,700 కోట్ల విలువైన విలాసవంతమైన ఆస్తులను అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ 5(1) కింద మార్చి 24న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమ బెట్టింగ్‌ల ద్వారా సంపాదించిన నేరపూరిత ఆదాయంతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.

బుర్జ్ ఖలీఫాలో అపార్ట్‌మెంట్లు!

జప్తు చేసిన ఆస్తుల్లో దుబాయ్‌లోని 18 స్థిరాస్తులతో పాటు న్యూఢిల్లీలోని రెండు కీలక ఆస్తులు ఉన్నాయి. విదేశాల్లోని ఆస్తులు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ హిల్స్ ఎస్టేట్‌లో అత్యున్నత శ్రేణి విల్లాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. బిజినెస్ బే, ఎస్‌ఎల్‌ఎస్‌ హోటల్‌లో ఖరీదైన నివాస సముదాయాలున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫాలో కూడా వీరికి అపార్ట్‌మెంట్లు ఉండటం గమనార్హం.

బినామీ నెట్‌వర్క్ గుట్టురట్టు

తమ యాజమాన్య హక్కులను దాచడానికి మహదేవ్‌ యాప్‌కు చెందిన రెండు షెల్ కంపెనీలు బినామీల పేరుతో ఒక పెద్ద నెట్‌వర్క్‌ను నడిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దుబాయ్ హిల్స్‌లోని ‘హిల్స్ వ్యూ’లో ఉన్న విల్లా నంబర్ 36 చంద్రకర్ ప్రధాన నివాసమని గుర్తించారు. దీన్ని ‘పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎల్‌ఎల్‌సీ’ పేరుతో కొనుగోలు చేశారు. ఇందులో చంద్రకర్‌కు 95% వాటా ఉంది. రవి ఉప్పల్ అధీనంలో ఫెయిర్‌వే రెసిడెన్సీ క్లస్టర్‌లోని విల్లా నంబర్ 33 ఉన్నట్లు సమాచారం. అతుల్ అగర్వాల్ (విల్లా 50), శుభం సోని (విల్లా 13), విశాల్ రమణి (విల్లా 31) వంటి సన్నిహితుల పేరుతో ఉన్న ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.

ఇప్పటివరకు రూ.4,336 కోట్ల ఆస్తులు జప్తు

ఈ తాజా జప్తుతో కలిపి మహాదేవ్ యాప్ కేసులో ఇప్పటివరకు ఈడీ అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.4,336 కోట్లకు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా చంద్రకర్ కనీసం 35 నుంచి 40 విల్లాలు, అపార్ట్‌మెంట్‌లను నియంత్రిస్తున్నారని దర్యాప్తు సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్, అతుల్ అగర్వాల్, శుభం సోనీలను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది. దీని ద్వారా వారి ఆస్తులను పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement