భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం గురువారం కమనీయంగా జరిగింది. శ్రీరామనవమికి ముందు రోజు వారి వంశాల విశిష్టతలను, గొప్పతనాన్ని వివరించే ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంతుని వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం రెండు సముమూహాలుగా ఏర్పడిన అర్చకులు స్వామివారు, అమ్మవారి వంశాల గొప్పదనాన్ని పోటీపడి వివరించారు. సీతమ్మ వారివైపు స్థానాచార్యులు స్థలశాయి బృందం, రామయ్య వారివైపు పండితులు ఎస్టీజీ కృష్ణమాచార్యుల బృందం చేరి వేడుక నిర్వహించారు. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించేలా భక్తులందరికీ పన్నీరు చల్లారు. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. కాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతురావు, ఆలయ ఈఓ దామోదర్రావు, స్థానాచార్యులు వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, రామకోటి స్వరూప్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్తులను అలరించిన ఎదుర్కోలు ఉత్సవం


