రైతుల ఆందోళనతో గ్రామసభ వాయిదా
ఇల్లెందురూరల్: రైతుల ఆందోళన పెసా గ్రామసభను అధికారులు వాయిదా వేశారు. మండలంలోని సీఎస్పీబస్తీ గ్రామపంచాయతీ కమ్యూనిటీ హాల్లో సర్వే నంబర్ 549 పరిధిలో 151.85 హెక్టార్ల భూమిని సింగరేణి సంస్థకు అప్పగించేందుకు గురువారం పెసా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ జేకే ఓసీ విస్తరణ ప్రాజెక్ట్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. పట్టాలు ఉన్నా, లేకున్నా నిర్వాసితులకు పరిహారం ఇస్తామని గతంలో నిర్వహించిన పెసా గ్రామసభలో అప్పటి ఆర్డీఓ స్వర్ణలత హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సర్వే నంబర్ 549 పరిధిలో సాగులో ఉన్న ప్రతీ రైతుకు పరిహారం ఇవ్వాలని కోరారు. ఎఫ్ఆర్వో చలపతిరావు మాట్లాడుతూ అటవీభూమిలో నిర్వాసితులైన రైతులు తమ భూమి ఆధారాలు అందజేయాలని సూచించారు. తహసీల్దార్ రవికుమార్ కూడా ఇదే విషయాన్ని పేర్కొనడంతో రైతులు నిరసన తెలిపారు. పోడియం వద్దకు వచ్చి దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్నామని, గతంలో తమ వద్ద వసూలు చేసిన శిస్తు రశీదులను, గతంలో తమకు రెవెన్యూ అఽధికారులు జారీ చేసిన పట్టాలను చూపించారు. సదరు భూమి అటవీశాఖకు సంబంధించినదే అయితే నాటి నుంచి అటవీశాఖ అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రశ్నించారు. దీంతో సర్వే నంబర్ 549కి సంబంధించి సరిహద్దులు ఏర్పాటు చేసి, సాగులో ఉన్న భూమి ఏ శాఖ పరిధిలో ఉందో తేల్చేందుకు వారం రోజుల్లో క్షేత్రపర్యటన చేస్తామని తహసీల్దార్ తెలిపారు. దీంతో గ్రామసభను వాయిదా వేశారు. గ్రామసభలో పెసా ఉపాధ్యక్షుడు పినబోయిన వెంకటేశ్వర్లు, ఎంపీవో చిరంజీవి, కార్యదర్శి షర్మిల తదితరులు పాల్గొన్నారు.
బిడ్డను లాలిస్తూ
సర్పంచ్ లావణ్య గ్రామసభకు తన ఇద్దరు చిన్నపిల్లలతో హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహిస్తూ మధ్యలో ఏడుస్తున్న పిల్లలను లాలించారు. పాలకోసం ఏడుస్తున్న బిడ్డను లాలించి పక్కనే ఉన్న విశ్రాంతి గదిలోకి వెళ్లి చిన్నారి ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
సాగుదారులందరికీ
పరిహారం చెల్లించాలని డిమాండ్
రైతుల ఆందోళనతో గ్రామసభ వాయిదా


