వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
● మహిళ తండ్రిని హతమార్చిన వ్యక్తి ● ఆపై పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
తిరుమలాయపాలెం: ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని వృద్ధుడైన ఆమె తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి ఆయనను కత్తితో పొడిచి హతమార్చడమే కాక పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. తిరుమలాయపాలెం మండలం పడమటితండాలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బోడియాతండాకు చెందిన బానోతు సాయి అత్తగారి ఊరైన పడమటితండాలో 20ఏళ్లుగా మెకానిక్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే గుగులోతు రామచంద్రు(55) పెద్ద కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైనా భర్తను వదిలివేసి ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంట్లో ఉంటోంది. ఆమెతో సాయికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా రామచంద్రు ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం బంధువు ఇంట్లో కార్యానికి వెళ్లగా అక్కడికి సాయి కూడా రావడంతో తన కుమార్తెతో సంబంధంపై నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై సాయి కత్తితో రామచంద్రుపై దాడి చేయడంతో కన్నుమూశాడు. ఆ తర్వాత నిందితుడు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
తండాలో ఉద్రిక్తత... పోలీసుల మోహరింపు
వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన రామచంద్రును సాయి హతమార్చడంతో పడమటితండాలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని ఆయన బంధువులు అడ్డుకున్నారు. అంతేకాక సాయిని చంపి పగ తీర్చుకుంటామని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. రామచంద్రు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఆయన బంధువులతో జరుపుతున్న చర్చలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య


