నూరు శాతం ఫలితాలు సాధించాలి
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● చెన్నంగులగడ్డ వార్డెన్ సస్పెన్షన్, హెచ్ఎంకు మెమో
ఇల్లెందురూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపించాయని, ఈ కొద్ది సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుని నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని రొంపేడు, చెన్నంగులగడ్డ ఆశ్రమ పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి.. పరీక్షలంటే భయం వీడాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం స్టడీ హవర్స్ విధిగా నిర్వహించాలని, పరీక్షలు పూర్తయ్యేవరకు విద్యార్థులను బయటకు అనుమతించొద్దని, డ్రాపౌట్స్ ఉంటే పాఠశాలకు తీసుకొచ్చి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కింది తరగతుల వారితో ఉద్దీపనం వర్క్బుక్లోని అంశాలను బోర్డుపై రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్ల లకు మెనూ ప్రకారం అల్పాహారం అందించాలని చెప్పారు. చెన్నంగులగడ్డ ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం, రుచిగా లేకపోవడంతో వార్డెన్ బాయమ్మను సస్పెండ్ చేయడంతో పాటు హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ అశోక్, హెచ్ఎంలు పద్మ, నామ తదితరులు పాల్గొన్నారు.


