28 నుంచి బ్రహ్మోత్సవాలు
మార్చి 2న తిరుకల్యాణ మహోత్సవం
ఐదురోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసిఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు వేడుకలు జరపనున్నారు. 28న ఉత్సవాలు ప్రారంభం కానుండగా, మార్చి 2న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. ఆలయానికి రంగులు వేసే, మండపం చుట్టూ కాంక్రీట్ పనులు చేపడుతున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చుతున్నారు. ఆలయ మేనేజర్పాకాలవెంకట రమణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గుండుగుపల్లిలో క్యాంప్ కార్యాలయంలో బుధవా రం ఆవిష్కరించారు. మేనేజర్ పాకాల వెంకట రమణ, శివాలయ చైర్మన్ మల్లెల నర్సింహారావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ప్రసాదా చార్యులు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
కాకతీయుల కాలం నాటి ఆలయం
వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. కాకతీయుల సేనాని అన్నపురెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రశాంతతపై మక్కువతో ఆలయ నిర్మాణం చేపట్టారని, అతని పేరుమీదనే అన్నపురెడ్డిపల్లి గ్రామం ఏర్పడిందని చెబుతారు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో గురుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కాగా ఆలయాన్ని కాళ్లూరి వంశస్తులు 1980లో పునర్నిర్మించినట్లు కాళ్లూరి ధర్మారావు రచించిన రాజధర్మ ప్రకాశిక పుస్తకంలో పేర్కొన్నారు.
2,300 ఎకరాల భూమి
స్వామివారి కై ంకర్యాల నిమిత్తం ఆలయానికి 2,300 ఎకరాల భూమి ఉంది. కాకతీయుల కాలంలోనే రాయుడుచెరువు, నల్లచెరువులను నిర్మించినట్లు శాసనాల్లో పేర్కొన్నారు. ఆలయాన్ని 1969 నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షిస్తుండగా 1974లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో మహామండపం, ప్రాకార మండపం, నాలుగు దిక్కులు భారీ గోపురాలు నిర్మించారు.
28న వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం ..
ఈ నెల 28న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మార్చి 5న ముగియనున్నాయి. తొలిరోజు ఆరా ధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం తదితర పూజాధికాలు నిర్వహిస్తారు. మార్చి 1న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం చేస్తారు. గురుడ ప్రసాదం అందజేస్తారు. 2న పసుపు కొట్నాలతోపాటు తలంబ్రాలు కలుపుతారు. ఎదుర్కోలు ఉత్సవం, తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 3న చంద్రగ్రహణం కావడంతో ఆలయాన్ని మూసేస్తారు. 4న సామూహిక సుదర్శన హోమం, దొంగలదోపు ఉత్సవం, రథోత్సవం చేస్తారు. చివరిరోజు 5న ద్వారతోరణ బలి, చక్రస్నానం తదితర పూజా కార్యకమాలు నిర్వహించనున్నారు.
28 నుంచి బ్రహ్మోత్సవాలు


