ఫారెస్ట్ వర్సెస్ రెవెన్యూ..
కారేపల్లి: అటవీ – రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళం నెలకొంది. తమ పరిధిలోని భూమిలో తవ్వకాలు చేపట్టారని అటవీ అధికారులు.. రెవెన్యూ అధికారులు కేటాయించిన స్థలంలోనే గోదాం నిర్మిస్తున్నామని కాంట్రాక్టర్ ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్ ప్రతినిధి అటవీ ఉద్యోగులపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. మండలంలోని గుట్టకిందిగుంపు గ్రామంలో గంగమ్మగుట్ట చివరి భాగాన సీలింగ్ భూమి పది ఎకరాలను ప్రభుత్వం రూ.9 కోట్లతో నిర్మించే గోదాంకు కేటాయించింది. అయితే, రేలకాయలపల్లి ఫారెస్టు సెక్షన్లో సీతా రామ ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి అటవీ భూమి సేకరించగా, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుట్టకిందిగుంపు గ్రామంలో గుట్టపై 33 ఎకరాలను అటవీ శాఖకు కేటాయించాక రెవెన్యూ అధికారులు హద్దులు కూడా నిర్ధారించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అటవీ పరిధిలోకి వచ్చే సుమారు 30 చదరపు గజాల్లో చెట్లు నరికి పొక్లెయినర్తో మట్టి తవ్వి తరలిస్తున్నారంటూ కారేపల్లి అటవీ రేంజ్ ఉద్యోగులు మంగళవారం సాయంత్రం అడ్డుకున్నారు. అనంతరం టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు మాత్రం రెవెన్యూ అధికారులు కేటాయించిన హద్దుల్లోనే పనులు చేపడుతున్నా అటవీ ఉద్యోగులు వర్కర్లపై దాడి చేసి టిప్పర్ స్వాధీనం చేసుకున్నారంటూ సూపర్వైజర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.


