
శాస్త్ర విజ్ఞానానికి ప్రయోగశాలలు దోహదం
సుజాతనగర్/చండ్రుగొండ: పాఠశాలల్లో ప్రయోగశాలల నిర్వహణ సక్రమంగా లేకపోతే విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి కోల్పోతారని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ అన్నారు. శనివారం సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్తో పాటు సాధారణ ప్రయోగశాలలను సందర్శించిన ఆయన వీటి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రయోగశాలలు ఎంతగానో దోహదపడతాయని, వారిలోని సామర్థ్యాలను వెలికితీసేందుకు ఇవి చాలా అవసరమన్నారు. ప్రయోగశాలలకు ఏమైనా పరికరాలు అవసరమైతే తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎస్సెస్సీ విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే చండ్రుగొండలోని జెడ్పీ హైస్కూల్ను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ సందర్శించి అందులోని అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రెరీతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. సైన్స్తోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, సీఎంఓ సైదులు, హెచ్ఎం ఎంఏ వాజీద్, సేవ్యా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.