
బ్యాటరీల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
అశ్వారావుపేటరూరల్: పార్కింగ్ చేసి ఉన్న వాహనాల నుంచి విలువైన బ్యాటరీలను అపహరిస్తున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట శివారులో శుక్రవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కిశోర్ ఆటోలో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా రెండు బ్యాటరీలను గుర్తించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా.. వినాయకపురం వద్ద రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న ట్రాక్టర్, డోజర్ (బ్లేడ్ ట్రాక్టర్) నుంచి వాటిని అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ఆటోను సీజ్ చేసి, చోరీ చేసిన రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న బ్యాటరీల విలువ రూ.15 వేలు ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.