
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన హెచ్ఎం
దుమ్ముగూడెం: అతనో ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ప్రస్తుతం ఆయనలా పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ఎక్కడ చదివిస్తారో అందరికీ తెలిసిందే. కానీ, ఈయన మాత్రం తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మండలంలోని నారాయణరావు పేట ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుంజా శ్రీనివాసరావు బడిబాట, అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తన కుమార్తెకు 4వ తరగతిలో అడ్మిషన్ ఇచ్చారు. గతేడాది భద్రాచలంలో చదివిన చిన్నారి.. ప్రస్తుతం ఈ పాఠశాలలో చేరింది. ప్రభుత్వ జీతం వేలల్లో తీసుకుంటూ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేవారు ఎంతో మంది ఉండగా.. ప్రధానోఫాధ్యాయుడు శ్రీనివాసరావు తీసుకున్న ఈ నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇదిలాఉండగా బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు పూలబొకేలు అందచేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సర్వేశ్దొర, నాగభూషణం, కోటేశ్వరరావు, మల్లం వెంకటేశ్, మల్లయ్య, వీరయ్య, కల్యాణి, సుభద్ర, హరిలాల్, సురేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.