
మలేరియాతో వ్యక్తి మృతి..?
అశ్వారావుపేటరూరల్: తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పాతరెడ్డిగూడేనికి చెందిన ఉమ్మల చిన్నవెంకటరెడ్డి (38) పది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. బుధవారం జ్వరం తీవ్రంకావడంతో మండలంలోని వినాయకపురం పీహెచ్సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ, కుటుంబీకులు గురువారం సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మలేరియా కారణంగానే చిన్న వెంకటరెడ్డి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వినాయకపురం పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం పాతరెడ్డిగూడెంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 39 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరుగురు జ్వరాలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. పీహెచ్సీ వైద్యులు రాందాస్నాయక్ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తే మలేరియా జ్వరం నిర్ధారణ కాలేదని, జ్వరం అధికంగా ఉండటంతోపాటు ప్లేట్లెట్లు పడిపోవడంతో కొత్తగూడెం ఆస్పత్రికి రిఫర్ చేశామని చెప్పారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.