
మా భూమి ఇప్పించండి
సూపర్బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట నుంచి కొత్తగూడెం వరకు గత మూడు రోజులుగా పాదయాత్ర చేసిన ఆదివాసీలు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు 80 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనే సంకల్పంతో పాదయాత్రగా చేరుకున్నారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడేనికి చెందిన ఆదివాసీలు సర్వే నంబర్ 30, 36, 39లో 1954 నుంచి 150 కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాయని ఆదివాసీ నాయకుడు మడకం నాగేశ్వరరావు తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇచ్చిందని, సాగు చేసుకుంటున్న 573 ఎకరాల భూమి ఆదివాసీలదేనని హైకోర్టు సైతం 2011లో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. అయినా అటవీ శాఖాధికారులు వ్యవసాయం చేయనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ ధర్నా వద్దకు చేరుకుని కలెక్టర్కు సమస్యలు వివరించి పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల ఆందోళన