
భద్రాద్రి రామయ్యకు వైభవంగా జ్యేష్ఠాభిషేకం
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి బుధవారం వైభవంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి రోజున దేవస్థానంలో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. తొలుత పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చిన అర్చకులు.. బేడా మండపంలో ఏర్పాటు చేసిన 81 కలశాల్లో సమస్త నదీ జలాలను ఆవాహన చేశారు. స్వామివారికి మొదట పంచామృతంతో, ఆ తర్వాత 81 కలశాల్లో అవాహన చేసిన నదీ జలాలతో జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. అనంతరం హోమశాలలో యాగం నిర్వహించారు. దేశంలో వరుణ దేవుడి కరుణా కటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, తద్వారా దేశం పాడి పంటలతో సుభిక్షంగా వర్థిల్లాలని కోరుతూ పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారికి హారతి సమర్పించారు. కాగా, జ్యేష్ఠాభిషేకం సందర్భంగా బుధవారం రద్దు చేసిన రామయ్య నిత్య కల్యాణం గురువారం యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు.