రైతులకు భరోసా కల్పించేందుకే ‘భూ భారతి’ | - | Sakshi
Sakshi News home page

రైతులకు భరోసా కల్పించేందుకే ‘భూ భారతి’

Jun 11 2025 8:48 AM | Updated on Jun 11 2025 8:48 AM

రైతులకు భరోసా కల్పించేందుకే ‘భూ భారతి’

రైతులకు భరోసా కల్పించేందుకే ‘భూ భారతి’

కరకగూడెం: దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరించడంతో పాటు రైతులకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. మంగళవారం ఆయన కరకగూడెం మండలం మోతెలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అంతేకాక గతంలో రిజిస్ట్రేషన్‌ లేని సాదా బైనామాలను క్రమబద్ధీకరించడం, వారసత్వ భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భూ రికార్డుల్లో తప్పుల సవరణ, మ్యుటేషన్‌ సమస్యలు పరిష్కరించేందుకు తహసీల్దార్‌, ఆర్డీఓ స్థాయిలో అప్పీల్‌ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము 60 ఏళ్లుగా అసైన్డ్‌ భూములు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, పట్టాలు ఇప్పించి హక్కులు కల్పించాలని గ్రామస్తులు కోరగా.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్‌ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ శంకర్‌, తహసీల్దార్‌ వట్టం కాంతయ్య, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం

పినపాక: ఇందిరమ్మ ఇళ్లు పేదల పాలిట వరమని, ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని వేణుగోపాల్‌ తెలిపారు. మంగళవారం ఆయన పినపాక మండలంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేశామని, అవకతవకలు, అక్రమాలకు తావు ఉండదని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ శంకర్‌, ఏఈ వినీత, ఎంపీడీఓ సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement