
పండుగ వాతావరణంలో బడులు ప్రారంభించాలి
చుంచుపల్లి: ఈనెల 12న పండుగ వాతావరణంలో బడులు ప్రారంభించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యా చందన ఆన్నారు. మంగళవారం ఆమె డీఆర్డీఏ కార్యాలయం నుంచి ఎంపీడీఓలు, ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్నందున సుందరంగా తీర్చిదిద్దాలని, మామిడి తోరణాలతో అలంకరించాలని సూచించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందించాలని చెప్పారు. బడిబాట షెడ్యూల్ ప్రకారం ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధన వంటి విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాన్ని బట్టి ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీఈఓ వెంకటేశ్వరా చారి మాట్లాడుతూ.. పాఠశాలలు 12న ప్రారంభమవుతున్న సందర్భంగా ఆవరణలోని పిచ్చి మొక్కలు, పొదలు శుభ్రం చేసి విషపురుగులు లేకుండా చూడాలన్నారు. తరగతి గదులను శుభ్రం చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్ల సహకారంతో ఐదేళ్లు నిండిన పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలని సూచించారు. వీసీలో అడిషనల్ డీఆర్డీఓ (సెర్ప్) నీలేష్, జిల్లా విద్యాశాఖ కో–ఆర్డినేటర్లు ఎస్కే సైదులు, ఎన్.సతీష్కుమార్, డీపీఎంలు రంగారావు, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విద్యాచందన