
ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంఅర్బన్: రాష్ట్రంలోని రెండు గిరిజన గురుకుల జూనియర్(పీవీటీజీ ఆదిమ గిరిజన తెగలు) కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. హైదరాబాద్ హయత్నగర్లో పీవీటీజీ–సీఓఈ(బాలురు, బాలికలు) గురుకులాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొండరెడ్డి, చెంచు, కొలం, తోటి, కోలావర్ తెగకు చెంది 2024–25 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సీటు లభించిన వారికి ఉచిత బోధన, భోజనంతో పాటు పాఠ్య, నోట్పుస్తకాలు, యూనిఫామ్, నైట్ డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్సులు, షూస్తో పాటు కాస్మోటిక్ చార్జీలు చెల్లిస్తారని పేర్కొన్నారు. అంతేకాక జేఈఈ మొయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, ఎప్సెట్, లాసెట్, సీయూ సెట్శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఖమ్మం రీజియన్ ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో ఈనెల 16లోగా దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 99497 23291, 94403 98993, 83099 31449 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.
1.92 క్వింటాళ్ల
నల్లబెల్లం పట్టివేత
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన దివాకర్ రాజు నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ టీం మంగళవారం అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో 1.92 క్వింటాళ్ల నల్లబెల్లం, ఐదు కేజీల పటిక పట్టుకున్నామని ఎకై ్సజ్ ఎస్ఈ కరమ్చంద్ తెలిపారు. దివాకర్రాజు కొంతకాలంగా నాటుసారా తయారీదారులకు నల్లబెల్లం, పటిక అమ్ముతున్నాడని, ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేశామని చెప్పారు. తనిఖీల్లో డీటీఎఫ్ ఎస్సై గౌతమ్, సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, గురవయ్య, వెంకటనారాయణ, శ్రావణి, పార్థసారధి పాల్గొన్నారు.
సింగరేణి కళాశాలలో మూడు కొత్తకోర్సులు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి డిగ్రీలో మూడు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు సింగరేణి ఎడ్యుకేషన్ సోసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), బీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు ప్రారంబిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల కుమార్తెలు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా కళాశాలలో అద్భుతమైన భోదన, పూర్తి సెక్యూరిటీతో హాస్టల్ నిర్వహణ ఉండడమే కాక నేటి డేటా ఆధారిత ప్రపంచంలో విశ్లేషణాత్మక నైపుణ్యాలు,సమస్య పరిష్కార సామర్థ్యాలు, కేరీర్ అవశాశాలు మెరుగు పడతాయని వెల్లడించారు.
కుమారుడి కళ్లెదుటే
తండ్రి మృతి
నేలకొండపల్లి: ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో మునగగా కుమారుడి కళ్లెదుటే మృతి చెందాడు. మండలంలోని రాజేశ్వరపురానికి చెందిన రెడ్డబోయిన హరికృష్ణ(32) తనకుమారుడు శివరామ్ ను తీసుకుని మంగళవారం గ్రామంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. తొలుత హరికృష్ణ బావిలో దూకగా, కుమారుడిని కూడా రమ్మన్నాడు. కానీ కుమారుడు భయంతో గట్టుపైనే ఉండగా ఈత కొడుతు న్న హరికృష్ణ కాసేపటికి నీటమునిగి మృతిచెందాడు. శివరామ్ ఇచ్చిన సమాచారంతో కుటుంబీకులు, స్థానికులు చేరుకుని ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు.
విద్యుదాఘాతంతో
దుక్కిటెద్దు మృతి
జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు గ్రామ పంచాయతీ రాచబండ్ల కోయగూడెం గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందింది. గ్రామంలోని వర్సా చంద్రయ్య అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు మేత కోసం పొలాలకు వెళ్లగా అక్కడున్న ట్రాన్స్ఫార్మర్కు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దాని విలువ రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని చంద్రయ్య విజ్ఞప్తి చేశాడు.