
కనిపించని మావోయిస్టుల బంద్ ప్రభావం
దుమ్ముగూడెం/చర్ల: మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు నిరసనగా తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం దుమ్మగూడెం, చర్ల మండలాల్లో కనిపించలేదు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడిచాయి. ఆటోలు, బస్సులు మామూలుగానే నడిచాయి. పోలీసులు మాత్రం అప్రమత్తమై ప్రధాన రహదారుల వెంట ముమ్మర తనిఖీలు చేపట్టారు. చర్ల మండలంలో ముందస్తుగా కట్టడి చేసి బంద్లో ఎవరూ పాల్గొనకుండా చర్యలు చేపట్టారు. దుమ్ముగూడెంలో సీఐ అశోక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టి అనుమానితుల వివరాలను అడిగి వదిలేశారు. సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
అట్రాసిటీ కేసు నమోదు
ఇల్లెందు: పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఓ యువతి.. శివకృష్ణ అనే ఆటోడ్రైవర్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శివకృష్ణతో పాటు ఆయన తల్లి జ్యోతి, మేనమామ వెంకన్నపై ఇల్లెందు పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరిపెడ బంగ్లాకు చెందిన శివకృష్ణ ఇల్లెందులో ఆటో నడుపుకుంటూ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కట్నం కోసం వదిలేశాడు. బాధితురాలి పిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేశారు.
దాడి ఘటనపై..
ఇల్లెందు: పట్టణంలోని 14 నంబర్ బస్తీకి చెందిన సాయి కిరణ్ అనే యువకుడిని అదే బస్తీకి చెందిన దినకరన్ అనే యువకుడు ఓసీ సమీపంలో దాడి చేసి గాయపర్చిన ఘటనపై ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేశారు. 14 నెంబర్ బస్తీలో ఓ ఫంక్షన్ వద్ద మంగళవారం ఘర్షణ జరిగింది. దీంతో సాయి కిరణ్ను దినకరణ్ తన బైక్పై హమాలీ బస్తీ ఓసీ సమీపంలోకి తీసుకెళ్లి దాడి చేశాడు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వృద్ధురాలి మెడలో
గొలుసు చోరీ
చండ్రుగొండ: వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన మంగళవారం తెల్లవారుజామున మండలంలోని బెండాలపాడులో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బండి జోగయ్య, రాధమ్మ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రాధమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లాడు. దంపతులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వెదికినా అప్పటికే దుండగుడు పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహెమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ శివరామకృష్ణ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
హత్య కేసులో
నిందితుడి అరెస్ట్
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సంచలనం సృష్టించిన కణితి సతీష్ హత్య కేసులో నిందితుడు గుంజ సాయిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న భద్రాచలం ఏఎస్ఆర్ కాలనీకి చెందిన కణితి సతీష్ అనే ఆటో డ్రైవర్ను పాత కక్షలతో గుంజ సాయి మరికొందరితో కలిసి దారుణంగా హతమార్చాడు. దీనిపై సతీష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, మూడు బృందాలుగా ఏర్పడి గాలించామని, సతీష్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న గుంజ సాయిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ ముందు హాజరు పరుచనున్నామని తెలిపారు. కాగా పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే నిందితులందరినీ పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు.

కనిపించని మావోయిస్టుల బంద్ ప్రభావం