వలస కూలీ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వలస కూలీ ఆత్మహత్య

Jun 11 2025 8:48 AM | Updated on Jun 11 2025 8:48 AM

వలస కూలీ ఆత్మహత్య

వలస కూలీ ఆత్మహత్య

జూలూరుపాడు: మండలంలోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఆయిల్‌ పామ్‌ క్షేత్రంలో పని చేస్తున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వలస కూలీ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ రాజేశ్వరరావు తెలిపిన వివరాలిల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్‌ రఘువంశీ(21), ఆల్ఫా రఘువంశీ దంపతులు కూలీ పనుల కోసం పది రోజుల క్రితం పడమట నర్సాపురానికి వచ్చారు. రైతు చలపతిరావు ఆయిల్‌ పామ్‌ తోటలో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి నీరజ్‌ అతిగా మద్యం తాగి ఇంటికి రాగా, భార్య ప్రశ్నించడంతో ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో భార్య ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా, మనస్తాపానికి గురైన నీరజ్‌ చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉద యం భార్య ఇంటికి వచ్చేసరికి నీరజ్‌ ఫ్యాన్‌కు వేలాడుతుండగా చుట్టు పక్కల వారి సాయంతో మృతదేహాన్ని కిందకు దింపింది. ఆల్ఫా రఘువంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజేశ్వరరావు తెలిపారు.

భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి..

చండ్రుగొండ: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటియాతండాకు చెందిన మధుసూదన్‌రావు(28)కు ఓ యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి మధుసూదన్‌రావు మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి రామచంద్రు ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు.

కడుపు నొప్పి తాళలేక వృద్ధురాలు..

టేకులపల్లి: కడుపునొప్పి తాళలేక వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని దాసుతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దాసుతండాకు చెందిన గుగులోత్‌ శాంతి(74) ఆరు నెలలుగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతోంది. కుమారుడు ఆమెకు పలుమార్లు వైద్యం చేయించినా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో సోమవారం కడుపు నొప్పి విపరీతంగా రావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగింది. కుటుంబసభ్యులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. శాంతి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గోదావరిలో మృతదేహం లభ్యం

మణుగూరు టౌన్‌: పాత మణుగూరు పరిధిలోని మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికు ల కథనం ప్రకారం.. పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన మైపా యేసోబు(42)కు చెందిన ద్విచక్ర వాహనాన్ని రెండు రోజుల క్రితం నది సమీపంలో గుర్తించారు. బైక్‌ను ఎవరైనా అపహరించి అక్కడికి తీసుకొచ్చారని భావించారు. అయితే మంగళవారం ఉదయం గోదావరిలో మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీయగా యేసోబుగా గుర్తించారు. మృతుడు పినపాకలో చర్చి పాస్టర్‌గా, జీఎస్‌ఎస్‌ క్రైస్తవ సంస్థ ఏర్పాటు చేసిన ఓ సెంటర్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నాడు. యేసోబుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యేసోబు మృతికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement