
అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు
● కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరిక ● రూ. 1.09 లక్షల విలువైన మిర్చి విత్తనాల పట్టివేత
జూలూరుపాడు: ప్రభుత్వ అనుమతి లేకుండా మిర్చి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలూరుపాడు మండలం అనంతారంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రైతులకు మిర్చి విత్తనాలు విక్రయిస్తున్నట్లు స్థానిక వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్కు సమాచారం అందిందని, దీంతో ఆయనతో పాటు కాకర్ల ఏఈఓ జె.వి.డి ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుతో కూడిన బృందం ఆ గ్రామానికి వెళ్లి తనిఖీ నిర్వహించిందని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఓ రైతుకు మిర్చి విత్తనాలు అమ్ముతుండగా పట్టుకున్నారని, వారిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. వారి నుంచి రూ. 1.09 లక్షల విలువైన 115 విత్తన ప్యాకెట్లు, క్రేటా కారు, రూ.13,000, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ ఇద్దరిలో ఒకరు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకొండికి చెందిన నున్నా మహేష్ ఏపీలోని గుటూరు జిల్లాలో జనతా సీడ్స్ మార్కెటింగ్ మేనేజర్గా పని చేస్తున్నాడని, మరో వ్యక్తి ఏన్కూర్మండలం జన్నారం గ్రామానికి చెందిన పల్లపు తిరుపతిరావుగా విచారణలో తెలిసిందని వెల్లడించారు. వారిద్దరూ గుంటూరు జిల్లాలో జనతా సీడ్స్ షాపు వద్ద ప్రజ్వల్ సీడ్స్, కావ్య సీడ్స్ మిర్చి విత్తనాలను ఒక ప్యాకెట్ ధర రూ 600 చొప్పున కొనుగోలు చేసి రైతులకు రూ. 950 చొప్పున విక్రయిస్తున్నారని చెప్పారు. ఇద్దరినీ అరెస్ట్ చేయగా నేరం అంగీకరించారని, రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ బాదావత్ రవి, పోలీస్ సిబ్బందితోపాటు, వ్యవసాయ అధికారులను డీఎస్పీ అభినందించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు, మందులను లైసెన్స్ ఉన్న వ్యాపారుల వద్ద మాత్రమే కొనుగోలు చేచాలని, తప్పని సరిగా రసీదులు తీసుకోవాలని అన్నారు.