పేదల సంక్షేమమే మా అజెండా | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే మా అజెండా

Jun 10 2025 3:20 AM | Updated on Jun 10 2025 3:20 AM

పేదల సంక్షేమమే మా అజెండా

పేదల సంక్షేమమే మా అజెండా

ఖమ్మంవన్‌టౌన్‌/రఘునాథపాలెం: పదేళ్లు తెలంగాణలో ఆర్థిక విధ్వంసం కొనసాగగా.. తాము అధికారంలోకి రాగానే నెమ్మదిగా సరిచేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి టీ పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన పూర్తి చేసి, అర్హులందరికీ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కోటి కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్న చరిత్ర తెలంగాణకే దక్కుతుందని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, రూ.500కే సిలిండర్‌, రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అయితే, పదేళ్ల పాటు దోపిడీ చేసిన ధనంతో బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించాలని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సర్దార్‌ సర్వాయి పాపన్న వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని గౌడ సంఘం హాల్‌ నిర్మాణం చేపట్టడమే కాక ఆయన విగ్రహం ఏర్పాటు చేసి కోచింగ్‌ సెంటర్‌ కూడా నిర్మించాలని కోరారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తన సహకారం ఉంటుందని భట్టి తెలిపారు.

ఖమ్మం అంటేనే ధైర్యం..

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఖమ్మం కాంగ్రెస్‌ కార్యాలయానికి పలుమార్లు వచ్చానని తెలిపారు. ఖమ్మం అంటేనే ధైర్యమని, ఇక్కడి ప్రజల ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. గౌడ హాల్‌ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల నిధులతో కూడిన ప్రత్యేక సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. విద్యను ప్రోత్సహించేలా కమ్యూనిటీ హాల్‌ ప్రాంగణంలో కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని వెల్లడించారు. కార్యకర్తలు దేవుళ్లని, పార్టీ కార్యాలయం ఆలయమని వెల్లడించిన ఆయన.. కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి తోడ్పడిన ఖమ్మం జిల్లాకు ప్రభుత్వంలోనూ ఎక్కువ ప్రాతినిధ్యం దక్కిందన్నారు. కాగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలుస్తామని, రాబోయే పదేళ్లు కూడా అధికారంలో ఉంటామని మహేష్‌కుమార్‌ వెల్లడించారు. గౌడ హాల్‌ పేదలకు ఉపయోగపడేలా, సమాజానికి సేవ చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్‌, మట్టా రాగమయి, మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్‌తో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, దొబ్బల సౌజన్య, నాగండ్ల దీపక్‌ చౌదరి, కొత్తా సీతారాములు, మొక్కా శేఖర్‌గౌడ్‌, ఏలూరి రవి, చింతల పుష్ప, భవాని, ప్రతిభారెడ్డి, బిచ్చాల తిరుమలరావు, డాక్టర్‌ రాజశేఖర్‌, బొల్లికొండ శ్రీనివాసరావు, కత్తి నెహ్రూగౌడ్‌, బోయనపల్లి లక్ష్మణ్‌, బండి నాగేశ్వరరావు, బండి వెంకన్న, వత్సవాయి రవి, బొర్రా రాజశేఖర్‌, పోతగాని వెంకటేశ్వర్లు, రాహుల్‌, కృష్ట, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

వచ్చే పదేళ్లూ మేమే అధికారంలో ఉంటాం

పార్టీ కోసం కష్టించిన కార్యకర్తలందరికీ పదవులు

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, పొన్నం, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement