
క్రమం తప్పకుండా డ్రైడే నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెల మొదటి, మూడో శుక్రవారాల్లో క్రమం తప్పకుండా డ్రై డే నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లెందు, చుంచుపల్లి, అశ్వారావుపేట, మణుగూరులో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. 2025 – 26లో ఉపాధి హామీ లక్ష్యాలను అధిగమించాలన్నారు. వన మహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆర్వైవీ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీపీఓ చంద్రమౌళి, బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు ఇందిర, అనసూర్య, ఇంజనీరింగ్ అధికారులు రమేష్, తిరుమలేష్, నళిని పాల్గొన్నారు.
బ్రోచర్లు ఆవిష్కరణ..
మైనార్టీ సంక్షేమ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ మతపెద్దల సహకారంతో మసీదుల వద్ద బ్రోచర్ను ప్రదర్శించాలని, మైనార్టీ స్కూళ్ల ద్వారా అందిస్తున్న నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
బెటాలియన్ క్యాంప్ సందర్శన..
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలోని 6వ బెటాలియన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఇటీవల శిక్షణ పొందిన ఎస్డీఆర్ఎఫ్ సభ్యులతో మాట్లాడారు. విపత్తు సమయంలో చేపట్టే చర్యలు, వారి వద్ద ఉన్న పరికరాలపై ఆరా తీశారు. ఓపెన్ జిమ్, మట్టి ఇటుకల యంత్రాలను పరిశీలించి, మట్టి ఇటుకలతో రోడ్డు తయారీకి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ అబ్దుల్ రషీద్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి..
పాల్వంచ: పాఠశాలల పునః ప్రారంభం నాటికి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన హాస్టల్ను తనిఖీ చేసి, సమస్యలపై ప్రధానోపాధ్యాయుడు భద్రును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు రంగులు వేయించాలని, సెలవులు ముగిసే నాటికి నూత న హంగులతో కళకళలాడాలని ఆదేశించారు.