
తుమ్మల క్షేత్రంలో మామిడి.. విదేశాలకు ఎగుమతి
దమ్మపేట : మండలంలోని లింగాలపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన ఐదెకరాల మామిడి తోటలో పండించిన పంట విదేశాలకు ఎగుమతి అవుతోందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల డీన్ హేమంత్ కుమార్ తెలిపారు. ఆ తోటలో సాగవుతున్న పలు రకాల మామిడిచెట్లను ఉద్యాన వన అధికారులతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. మామిడికాయలకు లేత దశలోనే కట్టిన ఫ్రూట్ బ్యాగులను తొలగించి చూడగా.. అంతర్జాతీయ ఎగుమతుల ప్రమాణాలకు తగిన నాణ్యతతో ఉన్నాయని, ఎకరానికి ఐదు టన్నుల మేర దిగుబడి వస్తుందని చెప్పారు. కాగా ఒక ఎకరాలో పండిన రెండున్నర టన్నుల పండ్లను డెక్కన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కంపెనీ వారు కొనుగోలు చేసి దుబాయ్, సౌదీ అరేబియాకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే పంట ధర టన్నుకు రూ.70 వేలు కాగా రాష్ట్రంలో విక్రయించే పండ్లు టన్నుకు రూ.35 వేల చొప్పున కొనుగోలు చేశారని వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు సందీప్, నవీన, కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్ పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
సూపర్బజార్(కొత్తగూడెం): భారీ ఈదురు గాలులు, వర్షాలతో జిల్లాలో పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయని, స్తంభాలు విరిగిపోయాని ఆ శాఖ ఎస్ఈ జి. మహేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ సిబ్బంది బుధవారం రాత్రి నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని, యుద్ధప్రాతిపదికన పనురుద్ధరన పనులు చేశారని తెలిపారు. యానంబైల్, రేగళ్ల, అశ్వారావుపేట మండలం వినాయకపురం, గుండాల మండలం మామకన్ను, కొత్తగూడెం బస్టాండ్ సెంటర్, రుద్రంపూర్ ఫీడర్, మణుగూరులోని రామానుజవరం, కాచనపల్లి ఫీడర్, మోరంపల్లి బంజర సబ్స్టేషన్, ఉప్పుసాక ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లగా మరమ్మతుల అనంతరం పునరుద్ధరించామని వివరించారు.