
తాపీమేసీ్త్ర కుమార్తె స్కూల్ టాపర్
పాల్వంచరూరల్: తాపీమేసీ్త్ర కూతురు పదో తరగతిలో ప్రతిభ చాటింది. మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన మాళోతు రవి తాపీమేసీ్త్రగా పనిచేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఐటీఐ చేస్తుండగా, కుమార్తె ఉషారాణి స్వగ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదివింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో 600మార్కులకు 523 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థినిని హెచ్ఎం రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు.
నేత్రపర్వంగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అకాల వర్షంతో
పంట నష్టం
మణుగూరు టౌన్/పాల్వంచరూరల్/ములకలపల్లి : అకాల వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. జిల్లాలోని పలుచోట్ల బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మణుగూరు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు, అశ్వాపురం, గుండాల, టేకులపల్లి, ఇల్లెందు, చండ్రుగొండ మండలాల్లో వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులు ఉరుకులు, పరుగులతో వెళ్లి పట్టాలు కప్పుకుని ధాన్యం కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణుగూరులో వడగండ్ల వాన పడింది.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం ఈనెల 3వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ కల్పిస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేదీతో గడువు ముగియగా, ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. మరోసారి మూడు రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి టీ.కే.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రూ.50.13 కోట్ల ఫీజు వసూళ్లతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలో మూడో స్థానాన నిలిచింది. ప్రస్తుతం గడువు పొడిగించిన నేపథ్యాన కేఎంసీతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల నుండి మరింత ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
5 నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
అశ్వారావుపేటరూరల్: వానాకాలం సాగుకు సంబంధించి రైతులను సమాయత్తం చేసేందుకు ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.