‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..? | - | Sakshi
Sakshi News home page

‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?

Jun 6 2025 6:03 AM | Updated on Jun 6 2025 6:03 AM

‘దబ్బ

‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?

అశ్వారావుపేటరూరల్‌: వందలాది ఎకరాలకు సాగునీరు అందించే దబ్బతోగు ప్రాజెక్టు అధ్వాన్న స్థితికి చేరింది. ప్రాజెక్ట్‌ నిర్మించి పాతికేళ్లు కాగా, పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోవడం లేదు. శిథిలమై, తుప్పుపట్టిన షట్లర్ల కారణంగా పంటలకు అందాల్సిన సాగునీరు లీకులై వృథాగా పోతోంది. దీంతో సాగునీరు అందక ఆయకట్టు రైతాంగం ఆవేదన చెందుతోంది.

25 ఏళ్ల క్రితం నిర్మాణం

అశ్వారావుపేట మండలం దబ్బతోగు గ్రామంలో 2000వ సంవత్సరంలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ నిర్మించారు. దీంతో దబ్బతోగు, దబ్బతోగు కాలనీ, వినాయకపురం కాలనీ, మల్లాయిగూడెం, నారాయణపురం కాలనీ గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాలకు సాగునీరు అందింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం పూడిక తీసే పనులు, అలుగుకు మరమ్మతులు చేసి వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ మరమ్మతులు చేపట్టలేదు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమంలో కూడా ఈ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేయలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుప్పు పట్టిన షట్టర్లు.. నీటి లీకేజీ

దబ్బతోగు ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువల షట్టర్లు తుప్పు పట్టి శిథిలావస్థలో ఉన్నాయి. షట్టర్లు లీకై నిల్వ ఉన్న సాగునీరు వృథాగా పోతోంది. తక్షణం మరమ్మతులు చేపట్టకపోతే వర్షాకాలంలో అడ్డుకట్ట వేయడం కూడా సాధ్యం కాదని రైతులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే లీకేజీలతో సాగునీరు మొత్తం వృథాగా పోతుందని చెబుతున్నారు. షట్టర్ల కోసం నిర్మించిన కాంక్రీట్‌ గోడలకు సైతం బీటలు ఏర్పడ్డాయి. మరో వైపు ప్రాజెక్ట్‌లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోంది.

ధ్వంసమైన గైడ్‌ వాల్‌

గతేడాది జూలై 18వ తేదీ నుంచి కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దబ్బతోగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రాజెక్ట్‌లోకి వరదనీరు పోటెత్తడంతో అలుగు ఉధృతంగా పొంగి దిగువన ఉన్న గైడ్‌ వాల్‌ పూర్తిగా ధ్వంసమైంది. అలుగు దిగువన భారీగా మట్టి కోతకు గురి కాగా, ఐదు అడుగుల మేర భారీ గంతలు పడ్డాయి. ఈ ఏడాది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్‌ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని, ఆనకట్టపై చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించాలని రైతులు కోరుతున్నారు.

25 ఏళ్ల క్రితం సాగునీటి

ప్రాజెక్ట్‌ నిర్మాణం

దెబ్బతిన్న తూములు, షట్టర్లు, గైడ్‌వాల్‌

పూడిక పేరుకుపోయి

నీటి నిల్వ తగ్గిన ప్రాజెక్ట్‌

ప్రతిపాదనలు పంపాం

దబ్బతోగు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించాం. కానీ ఇంకా నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. అలుగు గైడ్‌ వాల్‌ మరమ్మతులు వచ్చే ఏడాది చేస్తాం.

–కృష్ణ, డీఈఈ, అశ్వారావుపేట

‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?1
1/1

‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement