అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి

Dec 11 2025 8:12 AM | Updated on Dec 11 2025 8:12 AM

అక్రమ

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి ఘనంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ ఫౌండేషన్‌ డే వేడుకలు 17 నుంచి ధనుర్మాసం పూజలు

ఫిరంగిపురం: గుంటూరు జిల్లా అమీనాబాద్‌ కొండ ప్రాంతంలోని 545–25సర్వే నెంబర్‌లో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు మంగళవారం రాత్రి దాడులు చేశారు. విజిలెన్స్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్‌ ఏజీ అనిల్‌బాబు, సిబ్బందితో కొండప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో మట్టి తవ్విన ఆనవాళ్లు, కొందరు వ్యక్తులతోపాటు పొక్లయిన్‌ ఉండటంతో వారిని ప్రశ్నించినట్లు చెప్పారు. భాగ్యారావు అనే వ్యక్తి తవ్వకాలు చేయిస్తున్నట్లు తెలిసిందని, మైనింగ్‌శాఖ అనుమతి పత్రాలు అడగటంతో ఇంకా రావాల్సి ఉందంటూ చెప్పడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పొక్లయిన్‌ను సీజ్‌ చేసి వీఆర్వో రామాంజి ద్వారా పోలీసు స్టేషన్‌కు తరలించాలని చెప్పామన్నారు.

తాడేపల్లి రూరల్‌: కాంట్రాక్టర్లకు బకాయిలను వెంటనే చెల్లించాలని స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (సబ్కా) నాయకులు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని సబ్కా కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కొండా రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. డిప్యూటీ కోఆర్డినేటర్‌ సాధురావు, అసోసియేషన్‌ నాయకులు జీవీఆర్‌ నాయుడు, వి.శ్రీనివాసరావు, ఎ.సునీల్‌కుమార్‌, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్ట్‌ అధికారులు డ్యామ్‌ ఫౌండేషన్‌ స్టోన్‌ వద్ద బుధవారం వేడుక నిర్వహించారు. ముందుగా తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రాజెక్టు కుడి కాలువ గేట్స్‌ డీఈ శ్రీకాంత్‌ మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి దేశ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పునాది రాయి వేశారన్నారు. శ్రీ రాజా వాసిరెడ్డి రామ గోపాలకృష్ణ మహేశ్వరప్రసాద్‌ (ముక్త్యాల రాజా) సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి మూల పురుషుడు అన్నారు. ఆయన కృషి లేకపోతే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమయ్యేది కాదన్నారు. సాగర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందుతోందన్నారు. అనంతరం ముక్త్యాల రాజా విగ్రహానికి నివాళులు అర్పించారు. డీఈలు మురళీధర్‌, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమరావతి: ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు వైష్ణవ ఆలయాలలో నిర్వహించే ధనుర్మాస పూజలు ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు గోదాదేవికి తిరుప్పావై పాశురాలను ప్రవచించి, అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించటం ధనుర్మాస విశిష్టతగా చెబుతారు. మండలంలోని వైకుంఠపురం, వెంకటేశ్వరాలయం, అమరావతి, కోదండ రామాలయం, పాండురంగ స్వామి ఆలయం, మల్లాది వట వృక్షాంతర్గత వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ధనుర్మాస పూజలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి 1
1/3

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి 2
2/3

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి 3
3/3

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారుల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement