 
															రైతులకు ఎలాంటి సాయం అందలేదు
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో
వీడియో కాన్ఫరెన్స్లో మేరుగ నాగార్జున
సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కానీ ప్రచార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్తో నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో 78 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని, 66 వేల ఎకరాల్లో వరి దెబ్బతిందని, వేమూరు, బాపట్లలో ఎక్కువ నష్టం జరిగినట్లు తెలిపారు. 3 వేల ఎకరాల్లో పత్తి, 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో 5 వేల ఎకరాల్లో మినుము నీట మునిగిందని, అద్దంకిలో మిర్చి పంటకు భారీ నష్టం కలిగిందని తెలిపారు. ఇది వరకు తుఫాన్ లాంటి విపత్తులు సంభవిస్తే రైతు భరోసా కేంద్రాల సిబ్బందితో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పని చేశారని, ఈ రోజు ఆ లేమి కనిపిస్తోందని అన్నారు. ప్రజలు నాటి ప్రభుత్వాన్ని తలుచుకుంటున్నారని తెలిపారు. ఆ రోజు మనం రైతుకు ఎంత అండగా నిలిచామో గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఇంకా రేపల్లె, చీరాల ప్రాంతాల్లో ఆక్వాకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రొయ్యలు చనిపోయాయని, మొత్తంగా ఈ తుపాన్ వల్ల రైతు కుదేలు అయ్యాడని వివరించారు. తుఫాన్ తుఫాన్ అంటూ కూటమి ప్రభుత్వం అధికారులతో హడావుడి చేసిందేగానీ, రైతులకు ఎలాంటి సాయం అందలేదని తెలిపారు.
రేపల్లె: మోంథా తుఫాన్ను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా ఇబ్బంది లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఆర్డీవో నేలపు రామలక్ష్మి, డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, కమిషనర్ సాంబశివరావు, ఏడీఏ లక్ష్మి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పృథ్వీ గణేష్ పాల్గొన్నారు.
వేటపాలెం: మండల పరిధిలోని రామాపురం నుంచి కఠారివారిపాలెం గ్రామాల మధ్య సముద్రం తీరం వెంట ఉన్న నేల చప్టా వరద ఉధృతికి కొట్టు పోయింది. దీంతో తీరం వెంట రోడ్డుపై రాకపోకలు నిలిచి పోయాయి. ఓడరేవు నుంచి రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాల వరకు తారు రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు తూర్పు వైపు సముద్రం, పడమటి వైపున రిసార్టులున్నాయి. ఈ రోడ్డు మార్గంలోనే నిత్యం పర్యాటకులు, టెలీ ఫిలిమ్స్, షార్టు ఫిల్మ్లు తీసే వారు, చిత్ర పరిశ్రమలకు చెందిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు నేల చప్టా కొట్టుకొని పోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గం ద్వారా వాహనాలు ప్రయాణించకుండా రెండు వైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
ఏఎన్యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు గురువారం విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
 
							రైతులకు ఎలాంటి సాయం అందలేదు
 
							రైతులకు ఎలాంటి సాయం అందలేదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
