తీరంలో అధికార భూతాలు | - | Sakshi
Sakshi News home page

తీరంలో అధికార భూతాలు

Jun 26 2025 6:39 AM | Updated on Jun 26 2025 6:39 AM

తీరంల

తీరంలో అధికార భూతాలు

పచ్చ నేతలకు ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్ని కట్టబెడుతున్న రెవెన్యూ అధికారులు

తీరంపై అధికార పార్టీ గద్దలు వాలాయి.. రూ.కోట్ల విలువైన భూముల్ని కొందరు అధికారుల సాయంతో తన్నుకుపోతున్నాయి. ప్రజా ఆస్తులను ఫలహారంలా మింగేస్తున్నాయి. ప్రజా సంక్షేమం పక్కనపెట్టి దొరికిన కాడికి దోచుకుని జేబులు నింపుకొనే పనిలో పచ్చ పార్టీ నేతలు ఉన్నారు. అధికారులూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: కొన్నిచోట్ల నేతలు, అధికారులు కలిసి భూములను కబ్జా చేసి ఆక్రమిత భూములను రిసార్ట్‌ల నిర్మాణదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు పచ్చనేతలు, అధికారులు ఆక్రమిత స్థలాల్లో స్వయంగా రిసార్ట్‌లు నిర్మిస్తున్నారు. ఇంకొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న మిత్రులను పిలిపించి రిసార్ట్‌ల వ్యాపారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. వేటపాలెం, బాపట్ల, చినగంజాం మండలాల పరిధిలో ఈ తరహా ఒప్పందాలతో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను అధికారులతో కలిసి పచ్చ నేతలు కొల్లగొట్టి రూ.కోట్ల మేరకు అక్రమార్జనకు తెరతీశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. కొందరు అధికారుల తీరుపై జిల్లా రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తక్కువ ధరకే కట్టబెడుతూ..

వేటపాలెం మండలం పరిధిలోని విజయలక్ష్మీ పురం, ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రం తీరంలో(బీచ్‌) ఉన్న ప్రభుత్వ, అటవీ, అసైన్డ్‌ భూములను కొందరు రెవెన్యూ అధికారులు, పచ్చనేతలు కలిసి రిసార్ట్స్‌ యజమానులకు కట్టబెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. ఎకరం రూ.5 కోట్ల ధర పలుకుతున్న ఈ భూములను రూ. 2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు రిసార్ట్స్‌ యజమానులకు విక్రయిస్తున్నారు. చీరాల నియోజకవర్గ పచ్చ నేతకు పదుల ఎకరాల అసైన్డ్‌ భూములను అప్పగించిన రెవెన్యూ అధికారి.. ఇక్కడి మాజీ ఎమ్మెల్యేకు వేటపాలెం, చినగంజాం మండలాల్లో ఏకంగా వందలాది ఎకరాల అసైన్డ్‌ భూములు కట్టబెట్టినట్లు సమాచారం. పచ్చనేత ఆ ఆక్రమిత భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే ఆక్రమిత భూముల్లో దర్జాగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు.

ఉన్నతాధికారులకు అవినీతి చిట్టా

రెవెన్యూ అధికారి అవినీతి శ్రుతి మించడంతో ఏసీబీ పట్టుకుంది. రెవెన్యూ ఉన్నతాధికారుల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి వేటపాలెం అధికారిని సరెండర్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఆ అధికారి అవినీతి చిట్టాతో కలెక్టర్‌ ఒక పెద్ద గ్రంథాన్నే సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పక్కా వివరాలతో నివేదించినట్లు సమాచారం. ఇక్కడే పనిచేస్తూ భూ కబ్జాల్లో సిద్ధహస్తుడైన మరో రెవెన్యూ అధికారిని బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై చర్చ కొనసాగుతూ ఉండగానే జిల్లా కేంద్రమైన బాపట్ల రెవెన్యూ అధికారుల వ్యవహారం తెరపైకిచ్చింది. మరికొంతమందిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి అక్రమాలను అడ్డుకోవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ అధికారులు సముద్రతీర భూములూ కూటమి నేతలకు ధారాదత్తం ‘పచ్చ’ ముఠాతో కలిసి భూదందాలు శ్రుతి మించిన అక్రమాలతో ఇప్పటికే వేటపాలెం తహసీల్దారు సరెండర్‌ అదే బాటలో బాపట్ల రెవెన్యూ అధికారులపైనా చర్యలు? వివాదంలో పాండురంగాపురం తీరం భూముల వ్యవహారం పచ్చ నేతలకు భూములు అప్పగించారని రెవెన్యూ శాఖపై ఆరోపణలు ప్రభుత్వ భూములకు డీకేటీ పట్టాలిచ్చిన వైనంపై విమర్శలు విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ లోతుగా విచారణ చేపడితే వెలుగులోకి మరిన్ని అక్రమాలు

అటకెక్కిన కమిటీ..

ఈ భూకబ్జాల వ్యవహారం తేల్చేందుకు జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి విచారణ కమిటీని నియమించారు. నెల లోపు విచారణ పూర్తి చేస్తామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్క పాండు రంగాపురం భూ కబ్జాల వ్యవహారంలోనేకాక వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల కబ్జాలపైనా విచారణ నిర్వహించాలని ప్రజాసంఘాలతోపాటు పలు మత్స్యకార సంఘాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. అన్యాక్రాంతమైన వాటిని కాపాడాలని కోరుతున్నాయి. ఆక్రమణల వ్యవహారంపై ఎప్పటికప్పుడు దృష్టి నిలిపి వేటపాలెం రెవెన్యూ అధికారి తరహాలో అక్రమాలకు తెగబడిన మిగిలిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్‌ స్పందించి వేటు వేస్తే మిగిలిన వారు అక్రమాలకు దూరంగా ఉండే అవకాశముంది.

తీరాన్ని ఆక్రమించి మరీ...

చీరాలకు చెందిన పచ్చ నేత బుర్లా వెంకట్రావు, ఆయనతో కలిసి వ్యాపారం చేస్తున్న గుంటూరుకు చెందిన భ్రమర ఇన్‌ఫ్రా సంయుక్తంగా బాపట్ల మండలం పాండురంగాపురం వద్ద ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ సీ మౌత్‌తోపాటు అలల వరకూ సముద్రాన్ని ఆక్రమించారు. కొంత భాగానికి ఏకంగా డీకేటీ పట్టాలు పొందారు. ఈ ప్రాంతంలోని 9 గ్రామాల మత్స్యకారులు వ్యవహారాన్ని బయటపెట్టారు. అంతటితో ఊరుకోక ఆందోళనకు దిగారు. అధికారులు తాము పట్టాలివ్వలేదని బుకాయిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు మాత్రం ఆ డీకేటీ పట్టాలు కొత్తగా ఇచ్చినవని చెబుతున్నారు. మరోవైపు చుట్టుపక్కల వందలాది ఎకరాల అసైన్డ్‌ భూములకు సైతం రెవెన్యూ అధికారులు రూ.కోట్లు దండుకొని డీకేటీ పట్టాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

తీరంలో అధికార భూతాలు1
1/2

తీరంలో అధికార భూతాలు

తీరంలో అధికార భూతాలు2
2/2

తీరంలో అధికార భూతాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement