
రోబోటిక్ సర్జరీల్లో భారత్ పురోభివృద్ధి
గుంటూరు మెడికల్: మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికితల్లో రోబోటిక్, కృత్రిమ మేధస్సు (ఏఐ) పురోగతిని రష్యన్లకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. రష్యా రాజధాని మాస్కోలో నాలుగు రోజులు పాటు జరిగిన యూరో ఆసియన్ ఆర్థోపెడిక్ ఫోరం ప్రదర్శనలో పాల్గొని వచ్చిన ఆయన బుధవారం స్థానిక అరండల్పేటలోని సాయి భాస్కర్ హాస్పిటల్స్లో అక్కడి అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థోపెడిక్ విభాగంలో వినియోగం పెంచాలని సూచిస్తూ పలు రోబోటిక్లను ప్రారంభించినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా రష్యాలో జరిగిన ఈ ప్రదర్శనలో భారత్లో ఆర్థోపెడిక్ రంగంలో రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగాన్ని, అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను రష్యన్ సర్జనులకు వివరించడం కొత్త అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారు. జాయింట్ రీప్లేస్మెంట్లో రోబోటిక్ వాడకంపై రష్యన్ సర్జన్లు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారని వివరించారు. రష్యాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ సమావేశాలకు దాదాపుగా 500 మందికి పైగా ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు హాజరయ్యారని తెలిపారు. భారత్లో మోకీలు, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలలో రోబోటిక్ పాత్ర, అనుభవాలను అక్కడి వారికి వివరించినట్లు డాక్టర్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి