
తిమ్మరాజుపాలెంలో రైతుల రాస్తారోకో
పర్చూరు (చినగంజాం): వాడ రేవు నుంచి చిలకలూరిపేట వరకు చేపట్టిన 167ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులతో అవస్థలు పడుతున్నామని తిమ్మరాజుపాలెం రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు నిర్మాణం వలన వరద ముంపు సమయాల్లో తమ పొలాలు మునిగి పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద వరద నీరు పారేలా తూములు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో కిలోమీటరు మేర పదుల సంఖ్యలో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన టిప్పర్లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హైవే అధికారులతో మాట్లాడి వెంటనే తూములు ఏర్పాటు చేయిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు తాత్కాలికంగా రాస్తారోకో విరమించారు.
జాతీయ రహదారి నిర్మాణంతో అవస్థలపై నిరసన వరద నీటి తూముల ఏర్పాటుకు డిమాండ్

తిమ్మరాజుపాలెంలో రైతుల రాస్తారోకో