
వరి విత్తనాలు సిద్ధంగా ఉంచాలి
నరసరావుపేట రూరల్: ఖరీఫ్ సీజన్లో జిల్లాకు సరిపడా వరి విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి సూచించారు. నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు మండలాల పరిధిలోని వరివిత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 53,650 హెక్టార్లలో వరి సాగవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం 26,825 క్వింటాళ్ల వరి విత్తనం అవసరం అవుతుందని తెలిపారు. ఈ అంచనాల మేరకు బీపీ, జేజీఎల్, కేఎన్ఎమ్, ఎన్ఎల్ఆర్, అంకుర్ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ రకాలను డీలర్ల వద్ద అందుబాటులో ఉంచి అవసరం మేర సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. విత్తన దుకాణాదారులు ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలను అధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఏడీఏ మస్తానమ్మ, ఏఓలు శాంతి, పి.శివలలిత, వ్యవసాయ విస్తరణ అధికారి బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి మురళి