
మార్టూరు హైవే పై తప్పిన ప్రమాదం
ధ్వంసమైన రెండు కార్లు
మార్టూరు: నిత్యం రద్దీగా ఉండే మార్టూరు జాతీయ రహదారిపై స్థానిక పెట్రోలు బంకు ఎదుట శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన మాధవీ లత, శ్రీనివాసరావు దంపతులు తమ కారులో జె. పంగులూరు మండలం రామకూరు గ్రామానికి వెళ్లడం కోసం బొల్లాపల్లి టోల్గేట్ వైపు నుంచి మార్టూరు వస్తున్నారు. ఇదే మార్గంలో ఒంగోలు నుంచి విజయవాడ వైపు ఓ కియా కారు వీరి వెనుకనే వేగంగా వస్తుంది. శ్రీనివాసరావు తన కారును మార్టూరు సర్వీస్ రోడ్డులోపైకి వెళ్లటం కోసం స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో మలుపు వైపు తిప్పసాగాడు. ఆ వెనుకనే వేగంగా వస్తున్న కియా కారు డ్రైవరు ఈ పరిణామాన్ని ఊహించక ముందున్న కారును బలంగా ఢీ కొట్టి రహదారి మధ్యలోకి వెళ్లి ఆగిపోయాడు. ప్రమాద ధాటికి కియా కారులోని రెండు బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ సీటులోని వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద తీవ్రతకు శ్రీనివాసరావు దంపతుల కారు హైవే పక్కన డివైడర్ పై ఏర్పాటు చేసి ఉన్న ఐరన్ గ్రిల్ లో ఇరుక్కుని ఎటూ కదలకుండా ఆగిపోయింది. ప్రమాదంలో మాధవీ లత, శ్రీనివాస్రావులకు స్వల్ప గాయాలు కాగా హైవే అంబులెన్స్ సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైవే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్కు అవరోధంగా ఉన్న రెండు కార్లను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూశారు.

మార్టూరు హైవే పై తప్పిన ప్రమాదం